IndianEmbassyAdvisory: ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం బుధవారం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంపై మొదలైన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి.
ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తమ పాస్పోర్టులు, గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం కోరింది. ఎంబసీలో నమోదు చేసుకోని వారు వెంటనే తమ వివరాలు అందించాలని, అత్యవసర సాయం కోసం హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతీయులెవరూ ఇరాన్ పర్యటనలకు వెళ్లవద్దని కేంద్రం స్పష్టం చేసింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా వెంటనే స్వదేశానికి చేరుకోవాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది.
ఇరాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుండటం, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేయడం యుద్ధ మేఘాలను గుర్తు చేస్తోంది. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 2,500 దాటిందని, దేశవ్యాప్తంగా సుమారు 280 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
నిరసనకారులు వెనక్కి తగ్గవద్దని, త్వరలోనే సహాయం అందుతుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్ ఆగ్రహానికి కారణమైంది. ఈ ఉద్రిక్తతల మధ్య కతార్లోని ‘అల్ ఉదీద్’ వైమానిక స్థావరంలోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా ఆదేశించింది. గత ఏడాది జూన్లో ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసే ముందు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. మరోవైపు, అమెరికాకు ఆశ్రయం కల్పించే పొరుగు దేశాలపై దాడులు చేస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తోంది.
Read Also: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు?