India : యుద్ధం చేయట్లేదు అంతే. చేయాల్సిందంతా చేస్తోంది. పాక్ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. నింగి, నేల, నీటిపై పాకిస్తాన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తోంది. యుద్ధం కంటే.. యుద్ధ భయం ఎంత భయంకరంగా ఉంటుందో పాక్కు తెలిసొస్తోంది. ఎప్పుడు జంగ్ సైరన్ మోగుతుందో అంతుచిక్కక గిలగిల కొట్టుకుంటోంది పాపిస్తాన్. చేసిన పాపం అలాంటిది మరి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కంటినిండా నిద్ర పోయిన రోజంటూ లేకుండా పోయింది. అదిగో యుద్ధం.. ఇదిగో పీవోకేపై అటాక్ అంటూ దాయాది దేశానికి చుక్కలు చూపిస్తోంది ఇండియా. లేటెస్ట్గా పాక్పై త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది మోదీ సర్కార్.
బోర్డర్లో రాఫెల్ జెట్స్
యుద్ధం కంటే వ్యూహమే ముఖ్యం. ప్లాన్ ఎంత పక్కాగా ఉంటే.. వార్ అంత ఈజీగా ఫినిష్ చేసేయొచ్చు. ఇండియన్ ఆర్మీ సరిహద్దుల వెంట రెడీగా ఉంది. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది. రాఫెల్ జెట్లు బోర్డర్లో చక్కర్లు కొడుతున్నాయి. లేటేస్ట్గా, రాజస్థాన్ హైవేపై ఫైటర్ జెట్లను రాత్రి వేళ ల్యాండ్ చేసి.. పాకిస్తాన్కు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత్. మర్నాడే మరో షాక్.
సముద్రంలో ముచ్చెమటలు
“ఎనీ టైమ్, ఎనీ వేర్, ఎనీ హౌ”.. అనే క్యాప్షన్ ఇస్తూ ఓ ఖతర్నాక్ ఫోటో షేర్ చేసింది. సముద్రంలో సబ్మెరైన్, యుద్ధ నౌక, హెలికాప్టర్ గస్తీ కాస్తున్న ఫోటో అది. స్కార్పీన్ కేటగిరికి చెందిన జలాంతర్గామి.. ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌక.. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్లతో కూడిన ఆ ఫోటో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మూడూ కదిలే మారణహోమాలే. స్కార్పీన్ సబ్మెరైన్ శత్రువుల యుద్ధనౌకలను, జలాంతర్గాములను వేటాడటంలో ఎక్స్పర్ట్. టోర్పిడోలు, విధ్వంసక మిస్సైల్స్తో విరుచుకుపడుతుంది. ఐఎన్ఎస్ కోల్కతా పవర్ఫుల్ యుద్ధ నౌక. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల సత్తా పాకిస్తాన్కు లేనే లేదు.
నో ఫ్లై జోన్
మరోవైపు, భారత తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపై నిషేధం విధించింది భారత్. పాక్కు చెందిన ఏ బోట్ కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాక్ సివిల్, మిలటరీ విమానాలు ఎంటర్ కాకుండా నిషేధం విధించింది కేంద్రం. దీంతో ఆ దేశ పౌర విమానాలు చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళుతున్నాయి.
పాక్ నుంచి సర్వం బంద్
అటు, పాక్ పరోక్ష దిగుమతులపైనా నిషేధం విధించింది. ఏ విధంగానూ పాక్కు చెందిన దిగుమతులు భారత్లోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. నేరుగా కానీ.. ఇతర దేశాల మీదుగా కానీ పాక్కు చెందిన వస్తువులు భారత్లోకి రాకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. పాక్ టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్, పార్సిల్స్, పోస్టల్స్, మెయిల్స్.. సర్వం బంద్. అన్నిటిపై వేటు వేసింది మోదీ ప్రభుత్వం.
Also Read : పాకిస్తాన్ వెళ్తా.. ఆత్మాహుతి దాడి చేస్తా.. మంత్రి వీడియో వైరల్
కట్టడి.. ఇక ముట్టడే..
ఇప్పటికే పాక్ వీసాలను రద్దు చేశారు. భారత గడ్డపై నుంచి పాకిస్తానీయులు వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వేలాది మంది భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. ఏ విధంగానూ పాకిస్తాన్ అనే పేరు భారత్లో వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. నింగి, నేల, భూమిపై కట్టడి చేస్తోంది. ఇక ముట్టడే మిగిలింది.