Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్నూర్ సెక్టార్ లో ఆర్మీ కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో భారత ఆర్మీకి చెందిన కుక్క ‘ఫాంటమ్’ వీర మరణం పొందింది. ఈ విషయాన్ని వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనిదని వెల్లడించింది. పలు ఆపరేషన్స్ లో ఫాంటమ్ కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ‘‘మన నిజమైన హీరో, వీర భారత ఆర్మీ డాగ్ ఫాంటమ్ అత్యున్నత త్యాగానికి మేము వందనం సమర్పిస్తున్నాం. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరచిపోలేము’’ అని వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆర్మీ డాగ్ ఫాంటమ్ తాజా సెర్చ్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాదిన హతం చేసినట్లు ఆర్మీ వెల్లడించింది. అసన్ లో అఖ్నూర్ సెక్టార్ లోని దట్టమైన అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను మొదట గుర్తించి ఆర్మీకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఫాంటమ్ కన్నుమూసింది. ఈ శునకం మొత్తం తొమ్మిది ఆపరేషన్లలో పాల్గొన్నది. వీర మరణం పొందిన ఫాంటమ్ కు ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఫాంటమ్ పై త్రివర్ణ పతాకం కప్పి, పుష్ప గుచ్చం ఉంచి ఆర్మీ సిబ్బంది తుది నివాళులు అర్పించారు.
Update
We salute the supreme sacrifice of our true hero—a valiant #IndianArmy Dog, #Phantom.
As our troops were closing in on the trapped terrorists, #Phantom drew enemy fire, sustaining fatal injuries. His courage, loyalty, and dedication will never be forgotten.
In the… pic.twitter.com/XhTQtFQFJg
— White Knight Corps (@Whiteknight_IA) October 28, 2024
2022లో ఆర్మీలో చేరిన ఫాంటమ్
సైనిక శునకం ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. 25 మే 2020న జన్మించింది. ఫాంటమ్ వయసు నాలుగేళ్లు. 2022 ఆగస్టులో ‘ఫాంటమ్’ సైనిక దళాల్లో చేరింది. అప్పటి నుంచి పలు కీలక ఆపరేషన్లలో సైనికులకు ఎంతో సాయం చేసింది. ఫాంటమ్ K9 యూనిట్ లో అటాకింగ్ డాగ్ విడిజన్ లో విధులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాద వ్యతిరేక, తిరుగుబాటు నియంత్రణ కార్యకలాపాలలో K9 యూనిట్ లో భాగస్వామ్యం అవుతున్నది. మీరట్ లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ ఈ శునకానికి ట్రైనింగ్ ఇవ్వగా, ఆగస్టు 12, 2022న ఆర్మీ విధుల్లోకి తీసుకున్నారు.
బట్టల్ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
మరోవైపు ఆర్మీ కాన్వాయ్ మీద కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రత్యేక భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. బట్టల్ ప్రాంతంలో అసన్ ఆలయం సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారు. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం బలగాలు గాలిస్తున్నాయి. మృతి చెందిన ఉగ్రవాది దగ్గరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల తర్వాత అసన్ ఆలయం సమీపంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Read Also: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం