JEE NEET Exam: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక జేఈఈ (JEE), నీట్ (NEET) పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై కేవలం ప్రవేశ పరీక్షల్లో వచ్చే ర్యాంకుల ఆధారంగానే కాకుండా ఇంటర్మీడియట్ లేదా క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు ఎగ్జామ్స్ మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించే అంశంపై ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల హవా నడుస్తోంది. విద్యార్థులు బోర్డు పరీక్షలను, పాఠశాల విద్యను పక్కనబెట్టి కేవలం ఈ ప్రవేశ పరీక్షల కోచింగ్ కోసమే రూ.వేల నుంచి రూ.లక్షల్లో కుమ్మరిస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారడమే కాకుండా విద్యా వ్యవస్థను వ్యాపారీకరణ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్లపై విద్యార్థుల ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్ కు అనుగుణంగా మార్చాలని అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో జేఈఈ, నీట్ పరీక్షలను పూర్తిగా ఆన్ లైన్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్షల దిశగా మళ్లించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ 50 శాతం వెయిటేజీ నిబంధన అమల్లోకి వస్తే విద్యార్థులు తమ అకాడమిక్ విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులు బోర్డు పరీక్షలను కేవలం ‘పాస్’ మార్కుల కోసమే అన్నట్లు చదివి పూర్తి సమయాన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కే కేటాయించేవారు. కానీ కొత్త విధానం వల్ల అటు అకాడమిక్ సిలబస్ను, ఇటు ప్రవేశ పరీక్షల సిలబస్ను సమన్వయం చేసుకుంటూ చదవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇది విద్యార్థుల్లో ప్రాథమిక అవగాహనను పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కీలక మార్పుకు సంబంధించిన విధివిధానాలపై విద్యాశాఖ, జాతీయ పరీక్షల సంస్థ (NTA), వివిధ రాష్ట్రాల విద్యా బోర్డులతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ‘నార్మలైజేషన్’ (Normalization) పద్ధతిని ఎలా తీసుకురావాలనే అంశంపైనే ప్రస్తుతం ప్రధానంగా కసరత్తు జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కోచింగ్ మాఫియాకు చెక్ పెట్టడానికి, పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఒక మైలురాయిగా మారే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: అయోధ్య విరాళాల చోరీ.. యోగి సర్కార్ సీరియస్.. ‘బుల్డోజర్’ యాక్షన్కు రంగం సిద్ధం!
అయితే ఈ కొత్త ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒక్క రోజు రాసే ప్రవేశ పరీక్షే విద్యార్థి భవితవ్యాన్ని తేల్చేయకుండా, రెండేళ్ల కష్టానికి (క్లాస్ 12 లేదా ఇంటర్) విలువ దక్కడం మంచి పరిణామమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రవేశ పరీక్షల రోజు ఉండే తీవ్రమైన మానసిక ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని అంటున్నారు. అయితే మరోవైపు విభిన్న రాష్ట్రాల బోర్డుల సిలబస్ వేర్వేరుగా ఉంటాయని.. సీబీఎస్ఈ (CBSE)తో పోలిస్తే కొన్ని స్టేట్ బోర్డులలో మార్కులు సాధించడం కఠినంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది అసమానతలకు దారితీయవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
Also Read: పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!