Ayodhya Donations Theft: అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ముమ్మరం చేయడంతో నిందితుల విలాసవంతమైన ఇళ్లు, అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విరాళాల పెట్టెలు (డొనేషన్ బాక్సులు) ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి తోడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిపై ‘బుల్డోజర్’ యాక్షన్ తీసుకునే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ క్షణమైన నిందితుల అక్రమ ఆస్తుల కట్టడాలు కుప్పకూలొచ్చన్న ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది.
విరాళల చోరి కేసులో నిందితుడిగా ఉన్న లవ్ కుష్ మిశ్రాను బుల్డోజర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దొంగిలించిన సొమ్ముతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్న అతడి ఆస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితుడి భార్య పేరు మీద నిర్మాణం జరుగుతున్న ఓ భవనానికి సంబంధించి అయోధ్య అభివృద్ధి అథారిటీ (ADA) తాజాగా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే.. ఆ నిర్మాణాన్ని కూలుస్తామని ఇప్పటికే అథారిటీ హెచ్చరించింది.
అలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్టు అయిన 8 మంది నిందితుల్లో లవ్ కుష్ మిశ్రా ఒకరు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.14.25 లక్షల నగదు బయటపడింది. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. మిశ్రాకు షాహదత్ గంజ్ ప్రాంతంలో 1000 చ.అ. స్థలంలో విలాసవంతమైన బహుళ అంతస్తు ఇల్లు ఉంది. ఈ ఆస్తి మెుత్తం విలువ రూ.1.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. నెలకు రూ.20 వేల జీతం తీసుకునే మిశ్రాకు ఈ స్థాయిలో ఆస్తులు, డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
పోలీసుల వర్గాల ప్రకారం.. ఈ విశాలమైన ఇంటి కోసం మిశ్రా రూ.80-90 లక్షలు ఖర్చు చేశాడు. దాదాపుగా నిర్మాణం పూర్తైన ఈ 3 అంతస్తు భవనంలో విశాలమైన వంటగది, పడక గదులు, లిఫ్ట్ కోసం ప్రత్యేక స్థలంను ఏర్పాటు చేశారు. ఆలయ విరాళాల నుండి దొంగిలించిన డబ్బుతోనే ఈ ఆస్తికి నిధులు సమకూర్చారా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆ డబ్బుతోనే కట్టిందని తేలితే.. అయోధ్య అభివృద్ధి అథారిటీ (ADA) కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్లపై వచ్చి.. పోలీస్ను చితకబాదారు!
ఇదిలా ఉంటే విరాళాల చోరీకి సంబంధించి 8 మంది నిందితుల నుంచి భారీ మెుత్తంలో డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.80.92 నగదుతో పాటు, 1,121 డాలర్లను సీజ్ చేశారు. అంతేకాకుండా విరాళంగా ఇచ్చినట్లు భావిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను సైతం అధికారులు వారి వద్ద గుర్తించారు. నిందితులైన మనీశ్ యాదవ్ నుంచి రూ.2 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షల, లవకుష్ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, అనుకల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, రమాశంకర్ నుంచి రూ.7.32 లక్షలు, టి. అవినాష్ నుంచి రూ.20.39 లక్షలు, అవినాష్ శుక్లా నుంచి రూ.1 లక్ష చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read: పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!