KA Paul: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యాలు కూడా ఈ ఘర్షణలో భాగస్వాములవుతుండటంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. చమురు సరఫరా నిలిచిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ స్థాయిలో రాయబారాలు జరుగుతున్నాయి. మానవత్వానికి ముప్పు పొంచి ఉన్న ఈ తరుణంలో యుద్ధాన్ని ఆపడానికి అన్ని పక్షాలు తక్షణమే చర్చలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతర్జాతీయ శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఇరాన్ ప్రత్యేక ప్రతినిధి అయతోలా (Ayatollah) తో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతిని నెలకొల్పడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు పాల్ వెల్లడించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు ఆగిపోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని అడ్డుకునేందుకు కేఏ పాల్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రానున్న 72 గంటల పాటు ఇరాన్ ఎలాంటి దాడులు చేయకుండా, అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై దాడులు జరపకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతి స్థాపన విషయంలో తనకు 44 సంవత్సరాల అనుభవం ఉందని, యుద్ధాన్ని ఆపేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.
ఈ శాంతి ప్రయత్నాలకు సహకరిస్తున్న దేశాలకు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఖతార్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ (UK) తమ ఎయిర్ బేస్ లను యుద్ధం కోసం వాడనివ్వబోమని ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపివేసేందుకు రానున్న 48 గంటల పాటు తాను మూడు దేశాల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతానని ఆయన వెల్లడించారు.
Read Also: అమెరికా వర్సెస్ చైనా-రష్యా.. ఇది ప్రపంచ యుద్ధానికి సంకేతమా? రాహుల్ గాంధీ ఏమన్నారంటే!