Mysuru Airport: కర్ణాటక అధికార కాంగ్రెస్లో నాయకత్వ మార్పు ఖాయమా? మంగళవారం మైసూర్ ఎయిర్పోర్టులో ఏం జరిగింది? పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సీఎం, డిప్యూటీ సీఎంలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారా? లీడర్ షిప్ అంశం చర్చకు వచ్చిందా? పార్టీ కార్యక్రమాలపై చర్చించారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు వెంటాడుతున్నాయి.
కర్ణాటక పాలకపక్షంలో మార్పులు ఖాయమా?
కర్ణాటక అధికార కాంగ్రెస్లో లీడర్ షిప్ మార్పు అంటూ కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఆ తరహా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా మైసూర్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. సిద్దరామయ్య, డీకే శివకుమార్లతో ప్రత్యేకంగా మాట్లాడడం అనేక అనుమానాలు మొదలయ్యాయి.
తమిళనాడులోని ఓ కార్యక్రమానికి వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. తిరిగి పయానంలో మైసూరు విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు వీడ్కోలు పలికేందుకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లతో ఆయన కొద్ది సేపు చర్చించారు. తొలుత సిద్ధరామయ్య చెప్పిన విషయాలను అధినేత విన్నారు. ఆ తర్వాత డీకే శివకుమార్ చెప్పిన విషయాలను ఆలకించారు.
రాహుల్తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు
ఇద్దరు నేతలు చెప్పిన విషయాలను క్షుణ్నంగా విన్నారు రాహుల్గాంధీ. ఆ తర్వాత ఆయన తన నిర్ణయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత విమానంలో అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు రాహుల్గాంధీ. ఈ వ్యవహారంపై కర్ణాటక అంతటా చర్చ మొదలైంది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదన్నారు. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆఫీసు వాదన మరోలా ఉంది. రాహుల్తో చర్చ జరిగినట్లు తెలిపింది.
ALSO READ: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు
సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ఢిల్లీలో వేర్వేరుగా భేటీ అవుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, MNREGA పథకం చుట్టూ ఉన్న సవాళ్ల గురించి సిద్ధరామయ్య.. అగ్రనేతకు వివరించినట్టు తెలుస్తోంది.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలను ఢిల్లీకి పిలిచి చర్చిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది వరకు తెలిపారు. ప్రస్తుతం ఈ భేటీతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లీడర్ షిప్ మార్పుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
BIG MEET
RaGa – Sidda – DK pic.twitter.com/v6HsTcH0Mv
— Congress for Telangana (@Congress4TS) January 13, 2026