Kerala Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముదురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచార బరిలో నిలిచాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కీలక నేత పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన ధర్మదం నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఎనభై ఏళ్ల వయసులోనూ విజయన్ ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బుధవారం తన నియోజకవర్గంలో భారీ రోడ్షో నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విజయన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఇది ఏడోసారి కాగా.. ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక్కడ విజయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ తన అభ్యర్థిగా వీపీ అబ్దుల్ రషీద్ను నిలపగా.. భారతీయ జనతా పార్టీ తరఫున రంజిత్ పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరు నెలకొన్న ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూడా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. ఎర్నాకులంలో మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్.. రాష్ట్రంలోని మొత్తం 140 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 95 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారని.. కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా సామరస్యంగా ముగిశాయని స్పష్టం చేశారు. కేరళలో మార్పు తథ్యమని.. యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అటు భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి కేరళలో సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. తిరువనంతపురంలో కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల జాబితా ఎంతో బలంగా.. పోటీతత్వంతో కూడి ఉందని పేర్కొన్నారు. కేరళ ప్రజలు ప్రస్తుత పాలనతో విసిగిపోయారని.. తమ పార్టీ ఇచ్చే మార్పు సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని స్థానాల్లోనూ గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు బరిలో ఉండటంతో కేరళ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Read Also: Iran Drone Attacks: అమెరికాలో ఇరాన్ డ్రోన్ల కలకలం.. రక్షణ.. విదేశాంగ మంత్రులే టార్గెట్?