Leopard in Jaipur: ఇటీవల జనావాసాల్లో చిరుతలు సంచరించడం సర్వసాధారణమయిపోతుంది. ఇలాంటి ఎన్నో ఘటనలకు సంబంధించిన వార్తలు చూశాం. అడవుల్లో వాటికి ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. తాజగా జైపూర్లోని రాజస్థాన్ జలవనరుల శాఖ మంత్రి సురేష్ సింగ్ రావత్ (Suresh Singh Rawat) నివాసంలోకి చిరుతపులి ప్రవేశించడం కలకలం రేపింది.
మంత్రి ఇంటి ఆవరణలో చిరుత అడుగుజాడలను కుటుంబ సభ్యులు గమనించారు. ఆ అడుగులు నివాసం వైపు వెళ్తుండటాన్ని చూసి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అందులో చిరుత ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇది చూసి అంతా ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు మంత్రి ఇంటికి చేరుకుని చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టారు. ప్రస్తుతం మంత్రి కుటుంబం క్షేమంగానే ఉంది, కానీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
జైపూర్లోని మంత్రి సురేష్ సింగ్ రావత్ ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత, అటవీ శాఖ సిబ్బంది చిరుతకు మత్తుమందు ఇచ్చి దానిని అదుపులోకి తీసుకున్నారు. బంధించిన చిరుతను అధికారులు ఝలానా లెపార్డ్ రిజర్వ్ (Jhalana Leopard Reserve) కు తరలించారు.
మంత్రి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆ చిరుత సమీపంలోని ఒక పాఠశాల (School) ఆవరణలోకి కూడా ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్తగా పిల్లలందరినీ క్లాస్ రూముల్లో ఉంచి తాళం వేశారు. ప్రస్తుతం చిరుత పట్టుబడటంతో ఆ ప్రాంత ప్రజలు, మంత్రి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు.
#Leopard in civil lines #Jaipur. pic.twitter.com/18JOq7CgpU
— Rajeev Chaudhary 🇮🇳 (@kanderatomar) November 20, 2025
Read Also: Bandi Sanjay On Rajamouli: రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలి- బండి సంజయ్