Jharkhand: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా జార్ఖండ్లో భద్రతా బలగాలు-మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ అగ్రనేత సహా ఇద్దరు కమాండర్లు హతమయ్యారు. వీరిలో ఒకరిపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఈ ఘటనతో మావోల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు-మావోల మధ్య భీకర పోరు సాగింది. కోబ్రా దళాలు గోర్హర్ పోలీస్స్టేషన్ పరిధిలో పంతిత్రి అడవుల్లో స్థానిక పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసులకు స్పష్టమై సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి బలగాలు.
సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ మొదలైంది. బలగాలు-మావోల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల అగ్రనేత సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు కమాండర్లను రఘునాథ్ హేమంబరం, విర్సెన్ గంజూ హతమయ్యారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు మావోయిస్టులు మట్టుబెట్టినట్లు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ధ్రువీకరించింది.
సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్పై కోటి రివార్డు ఉంది. స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేంబ్రామ్ పై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు వీర్సేన్ గంఝూపై 10 లక్షలు రివార్డు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన ప్రాంతం నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.
ALSO READ: ట్రాక్ పై నిలిచిపోయిన మెట్రో.. ప్రయాణికుల్లో ఒకటే భయం
ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు అధికారులు. జులైలో కోబ్రా జవాన్ హత్యలో సహదేవ్ పేరు వెలుగులోకి వచ్చింది. మరణించిన ముగ్గురు మావోలు భారీ ఆపరేషన్కు ప్లాన్ చేస్తున్నట్లు ఎస్పీ హర్వీందర్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ 7న జరిగిన ఓ ఆపరేషన్లో మావోల సీనియర్ నాయకుడు అమిత్ హన్స్డా మరణించాడు. జోనల్ కమాండర్గా ఉన్నాడు. అతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది.
2025 ఏడాదిలో కోబ్రా దళాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో 20 మంది టాప్ మావోయిస్టు నేతలను మట్టుబెట్టాయి. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఇద్దరు బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు, మరో నలుగురు జోనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు సబ్-జోనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు, మిగతావారు వివిధ ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మావోలున్నారు.
కోబ్రా దళాలు 32 అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలు, 345 కిలోల పేలుడు పదార్థాలు, 88 డిటోనేటర్లు, 2500 మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు టాప్ మావోయిస్టులకు సంబంధించి 18 ప్రదేశాలు, 39 బంకర్లను ధ్వంసం చేశాయి.