Meghalaya Honeymoon Murder| దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం బయటపడుతోంది. వివాహం తరువాత నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లగా.. అక్కడ వరుడి మృత దేహం లభించింది. పెళ్లికూతురు ఆచూకీ తెలియలేదు. విచారణ ప్రారంభించిన పోలీసులు వారం రోజుల తరువాత ఆ యువతిని ఉత్తర్ ప్రదేశ్ లో ఒక ఢాబాలో అపస్మారక స్థితిలో కనుగొన్నారు. ఆ తరువాత ఆమె ప్రియుడు, మరో ముగ్గురు యువకులను కూడా అరెస్ట్ చేశారు. వీరంతా కలిసే ఈ హత్య చేశారని పోలీసులు అంటున్నారు. కానీ ఈ కేసులో ఆ యువతి అంతా పక్కా ప్లానింగ్ తో హత్య చేసిందని తాజాగా వెల్లడైంది.
పోలీసులు తెలిపిన ప్రకారం..
ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన ఆరోపణలతో సోమవారం లొంగిపోయింది. ఈ దారుణ హత్యను సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి మూడు రోజుల్లో ప్లాన్ చేసిందని సమాచారం అందింది. సోనమ్, రాజాతో సన్నిహితంగా ఉండడం ఇష్టం లేదని, వివాహానికి ముందే అతని నుండి దూరంగా ఉండేదని రాజ్తో చాట్లో చెప్పింది.
హత్యకు ముందే ప్లానింగ్
సోనమ్, రాజా రఘువంశీలు మే 10న మధ్యప్రదేశ్ ఇండోర్లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ తరువాత శోభనం రాత్రి తన భర్తతో అలా కలిసేందుకు ఆమె ఇష్టపడలేదు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో చాటింగ్ చేసి తెలిపింది. తన భర్తను అడ్డు తొలిగించుకునేందుకు అతడిని హత్య చేయడానికైనా వెనుకాడేది లేదని చెప్పింది. మే 21న సోనమ్ తన భర్త రఘువంశీతో కలిసి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు హనీమూన్ కోసం వెళ్లింది. అయితే అంతకుముందే సోనమ్ తన ప్రియుడు రాజ్తో కలిసి రాజాను హత్య చేయాలని నిర్ణయించింది. రాజ్, తన చిన్ననాటి స్నేహితులు ఆనంద్ కుమ్రి (23), ఆకాశ్ రాజ్పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22)లను ఇండోర్లోని ఒక కేఫ్లో కలిసి, డబ్బు ఆశ చూపి హత్యకు ఒప్పించాడు. మే 20న ఈ ముగ్గురు గువాహటికి వెళ్లి, ఆన్లైన్లో గొడ్డలి ఆర్డర్ చేశారు. అక్కడి నుండి షిల్లాంగ్లో సోనమ్, రాజా ఉన్న హోమ్స్టే సమీపంలో ఉన్న హోటల్లో బస చేశారు.
హత్య ఎలా జరిగింది?
మే 23న సోనమ్, రాజాను ఫోటోషూట్ పేరుతో చిరపుంజీ సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. ముగ్గురు నిందితులు కూడా వారిని అనుసరించారు. మొదట వారు రాజాతో హిందీలో మాట్లాడారు. సోనమ్ ఆలస్యంగా నడుస్తూ వెనుక ఉండిపోయింది. ఒక నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నప్పుడు, సోనమ్ “అతన్ని చంపేయండి” అని కేకలు వేసింది. ఆ ముగ్గురు నిందితులు రాజాపై గొడ్డలితో దాడి చేసి, ఆ తరువాత అతడిని సజీవంగానే లోయలోకి తోసేశారు. ఈ హత్యకు సోనమ్ ప్రియుడు రాజ్ ప్లానింగ్ చేశాడు. నేరుగా పాల్గొనలేదు. కానీ షిల్లాంగ్ పోలీసుల ప్రకారం.. అతను సోనమ్తో ఫోన్లో సంప్రదింపులు జరిపాడు.
హత్య కేసుగా మారిన మిస్సింగ్ కేసు
మే 23న రఘువంశీ, అతని భార్య సోనమ్ మిస్సింగ్ అయినట్లు పోలీసులు రఘువంశీ కుటుంబం ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 2న చిరపుంజీ సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి కూడా దొరికింది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం.. రాజా తలపై, వెనుక, ముందు రెండు సార్లు దాడికి పదునైన ఆయుధంతో చేసిన గాయాలున్నాయి. రఘువంశీ మరణం హత్యగా నిర్ధారణ అయింది. దీన్ని ప్రమాదం లేదా ఇతర సంఘటనగా భావించే అవకాశాన్ని పోలీసులు తోసిపుచ్చారు.
Also Read: ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లిన యువతి.. సూట్కేసులో శవమై లభ్యం
నాటకీయంగా పోలీసుల ముందు లొంగిపోయిన సోనమ్
రఘువంశీ శవం లభించడం, ఘటనా స్థలం నుంచి అతని భార్య సోనమ్ మిస్సింగ్ కావడంతో పోలీసులు ఆమె ఈ హత్య చేసి ఉంటుందని అనుమానించారు. వారం రోజుల తరువాత జూన్ 7 రాత్రి గాజీపూర్లోని ఒక ధాబాలో సోనమ్ స్పృహతప్పి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను గాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె పోలీసులకు లొంగిపోయింది. ముగ్గురు నిందితులను కూడా రాత్రిపూట దాడుల్లో అరెస్ట్ చేశారు. తనకు మత్తుమందు ఇచ్చి గాజీపూర్ తీసుకొచ్చారని సోనమ్ తెలిపింది. కానీ, ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రకారం.. సోనమ్ తనను తాను బాధితురాలిగా చూపించేందుకు ఈ కథనం సృష్టించింది.