![Minister Anurag Thakur comments on Telangana phone tapping issue](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/Minister-Anurag-Thakur-comment-on-phone-tapping-of-real-action-must.jpg)
Anurag thakur Comments on Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై రేవంత్రెడ్డి సర్కార్ తన పని తాను చేసుకుపోతోంది. రోజుకో అధికారి అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశం ముదిరిపాకాన పడింది. పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. దీంతో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పరిస్థితి గమనించిన కేంద్రంలోని మంత్రులు ఫోన్ ట్యాపింగ్ అంశంపై నోరు విప్పారు.
తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర ప్రసార సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నోరువిప్పారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తేలితే చట్ట ప్రకారం కేంద్ర చర్యలు తీసుకుంటుందన్నారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉపయోగించడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బుధవారం ఢిల్లీలో ప్రాంతీయ ఛానెళ్లతో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనా నోరువిప్పారాయన. ఎప్పుడూలేని విధంగా ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకోనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేసిన పోరాటమే ఇందుకు కారణమని ఒక్కముక్కలో తేల్చేశారు. తెలంగాణలో మా ఓటు బ్యాంకు గతంలో కేవలం ఏడు శాతం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది రెట్టింపయ్యిందన్నారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, కాకపోతే అప్పటి కేసీఆర్ సర్కార్ స్పందించకపోవడం వల్లే ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యమైందన్నారు.
Also Read: ఇక సమరమే.. ఆప్ శ్రేణులకు సంజయ్ సింగ్ పిలుపు..
తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. మా పార్టీ నేతలెవరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. అసలు అక్కడ ప్రబుత్వం ఏర్పాటు చేయాలంటే దాదాపు 61 మంది సభ్యులు ఉండాలన్నారు. బీజేపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. అలాగే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టుపైనా మాట్లాడారు మంత్రి అనురాగ్ ఠాకూర్. ఒకప్పుడు అరెస్టు చేయలేదని కేంద్రంపై బురద చల్లారని, ఇప్పుడు ఎందుకు అరెస్టు చేశారని మాట్లాడుతున్నారని అన్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై మనసులోని మాటను బయటపెట్టారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.