MLA Amitabh Bajpai’s Unique Protest in Uttar Pradesh: ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు రోడ్లెక్కి నిరసన చేస్తుంటారు. లేదా కొంతమంది రోడ్లపై పాదయాత్ర చేసి, బురద నీటిలో నిలబడి రోడ్డు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేసిన సందర్భాలను చూసి ఉంటారు. కానీ, ఓ ఎమ్మెల్యే మాత్రం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఇప్పుడా ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్కుకు ఓ టబ్ తో చేరుకున్నారు. అనంతరం ఆ టబ్ నిండా నీటిని పోసి.. ఆ తరువాత ఆ టబ్ లో కూర్చుని నిరసన తెలిపారు. దాని పక్కనే ఓ బ్యానర్ ను పెట్టారు. రూ. కోట్ల విలువైన స్విమ్మింగ్ ఫూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోవడంలేదంటూ ఆ బ్యానర్ పై రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, కాన్ఫూర్ పట్టణంలోని నానారావ్ పార్కు సుందీకరణ, నిర్వహణకు సంబంధించి అక్కడున్న యోగి ప్రభుత్వం పలు వాగ్దానాలు చేసింది. ఏండ్లు గడుస్తున్నా ఆ పార్కులో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం పూర్తి చేయడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఓ టబ్ తో ఆ పార్కు వద్దకు వెళ్లారు. అనంతరం ఆ టబ్ లో నీరు పోసి అందులో కూర్చొని, అందులో ఈత కొడుతున్నట్లు చేస్తూ.. స్వీట్లు తింటూ నిరసన తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్కులో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం విషయంలో కావాలనే యోగి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 2023లోనే ప్రారంభం కావాల్సి ఉందని, కానీ వారి నిర్లక్ష్యం కారణంగా ముందుకువెళ్లడంలేదన్నారు. దీంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.