![Supreme Court on Bribery Disorder](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/supreme-court-on-bribery-in.jpg)
Supreme court decision on bribery(Today latest news telugu): భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం ప్రసాదించిన పార్లమెంటరీ అధికారాల ద్వారా ఎలాంటి రక్షణ ఉండబోదని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఎంపీలు ఎమ్మెల్యేలపై వచ్చే అవినీతి, లంచాల ఆరోపణలపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణ సైతం జరపవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించింది.
సుప్రీంకోర్టు 1998లో ఈ విషయమై ఇచ్చిన తీర్పులో లంచం, అవినీతి కేసుల నుంచి ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పట్లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ సమీక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అనంతరం ఈ కేసు విషయమై పలు దఫాలుగా వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును గత ఏడాది అక్టోబర్ 5న రిజర్వ్ చేసి నేడు వెలువరించింది.
Read More : ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు గడువు ఇవ్వండి.. సుప్రీంను కోరిన ఎస్బీఐ..
1998 నాటి సుప్రీం ధర్మాసనం తీర్పును ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడంతో అవినీతి ప్రజాప్రతినిధులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఈకేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆసమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీగా ఉన్న శిబు సోరేన్ సహా అదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఆరోపణలపై అప్పట్లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టును చేరడంతో లంచం కేసుల నుంచి మినహాయింపు ఇస్తూ తీర్పు వెల్లడించింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద విచారించవచ్చని కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆర్టికల్స్ 105 సేక్షన్ 2, లేదా 194 సెక్షన్ 2 ఫ్రీడమ్ ఇస్తాయి కానీ.. ఎవరైనా సభ్యుడు లంచం తీసుకుంటూ పట్టుబడితే వారికి ఈ ఆర్టికల్స్ ఎలాంటి రక్షణ కల్పించవని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.