Mukul Roy No more: మాజీ రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ విషయం తెలియగానే టీఎంసీ నేతలు షాకయ్యారు.
కేంద్ర రైల్వే మాజీమంత్రి ముకుల్రాయ్ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మరణించారు. సోమవారం రాత్రి ఒంటిగంటన్నర సమయంలో కోల్కత్తాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కొడుకు సుభ్రాంషు రాయ్ తెలిపారు.
ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఆయన కూడా ఒకరు. జనవరి 1998న తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు రాయ్. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీలో ఆయన్ని నెంబర్ టూగా వర్ణించేవారు నేతలు. 2009లో కేంద్ర షిప్పింగ్ సహాయ మంత్రి పని చేశారు. ఆ తర్వాత 2011-12 మధ్యకాలంలో రైల్వే మంత్రి, పట్టణాభివృద్ధి మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం.
బెంగాల్ టీఎంసీ పార్టీలో కీలక నేత.. ఆ పార్టీ నేతలు సంతాపం
తృణమూల్ కాంగ్రెస్లో నెంబర్ టూ గా ఉండేవారు ముకుల్రాయ్. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ పార్టీకి వ్యూహకర్తగా మారిపోయారు. అయితే 2017లో నారద కుంభకోణం నేపథ్యంలో ఆయన పేరు బయటకురావడంతో ఆ పార్టీ నుండి బహిష్కరించబడ్డారు.
లంచాలు తీసుకున్నట్లు ఆరోపించబడిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో టీఎంసీ అగ్రనాయకత్వం ఆయనపై వేటు వేసింది. 2017 నవంబర్లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడయ్యారు. బెంగాల్లో పార్టీ ప్రచారాలను నిర్వహించారు ఆయన.
ALSO READ: దేశంలోని 32 యూనివర్సిటీలు ఫేక్.. అందులో ఏపీలో రెండు
అనారోగ్య కారణాలను చూపుతూ 2021లో ఎన్నికల నుంచి దూరమయ్యారు. 2021 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత తిరిగి ఆయన సొంతగూటికి తృణమూల్ కాంగ్రెస్కు తిరిగి వచ్చారు. 2021 తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. కాకపోతే పార్టీ వ్యవహారాలను మాత్రం చూసేవారు.