Nashik Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ బస్టాండ్లో బుధవారం ఉదయం గుండెలు పించే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల కోసం ప్లాట్ఫామ్పైకి వస్తున్న ఒక ఆర్టీసీ (MSRTC) బస్సు అదుపుతappi నిలబడి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సిన్నార్ డిపోకు చెందిన బస్సు (MH 14 BT 4149) సిన్నార్ నుంచి దేవ్ పూర్ (Devpur) వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో, బస్సును ప్లాట్ఫామ్పై పార్క్ చేస్తుండగా ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో, బస్సు ఆగకుండా నేరుగా ప్లాట్ఫామ్పై బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుల మీదకు ఎక్కింది.
ఈ ప్రమాదంలో దాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ బోరధే (9) అనే బాలుడు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆదర్శ్ తన తల్లితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘోరం జరిగింది. బాలుడి తల్లి గౌరీ బోరధే (30), అలాగే తమ్కట్వాడికి చెందిన విఠాబాయి భలేరావ్, జ్ఞానేశ్వర్ భలేరావ్ అనే ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కళ్లెదుటే బాలుడు చనిపోవడంతో బస్టాండ్లోని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత ఉదయ్ సాంగ్లే ఆధ్వర్యంలో పర్నె హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిన్నార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ఆర్టీసీ (MSRTC) స్పందించింది. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా (పరిహారం) ఇస్తామని, గాయపడిన వారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. బ్రేక్ ఫెయిల్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాసిక్లోని సిన్నార్ బస్టాండ్లో బస్సు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.#Pune #Accident pic.twitter.com/QLeqK6bM5s
— vm_updates (@VijayMarka88) November 19, 2025