NEET Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కేంద్ర మంత్రి రాజీనామాకు దారి తీసిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సీబీఐ సమర్పించింది. 360మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 డాక్యుమెంట్లు, 43 భౌతిక సాక్ష్యాలను ఛార్జ్ షీట్ కు జత చేసింది.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ దేశం మొత్తం మీద తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొన్ని రోజులపాటు ఆందోళనలు జరిపింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు మద్దతు పలికాయి. నిరసనలు జరిపాయి. దాంతో ఆందోళనలకు ముందే కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.
కేసు విచారణను ముమ్మరంగా సాగించిన సీబీఐ తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. దీంట్లో పలు కీలక విషయాలను పేర్కొంది. ఎన్టీఏకు చెందిన కొందరు సబ్జెక్టు నిపుణులు, మధ్యవర్తులు కలిసి పక్కా ప్రణాళికతో ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు పేర్కొంది. ప్రశ్నలను గుర్తుపెట్టుకోవడం, చీటీలపై రాసుకోవడం, సంబంధిత పాఠ్యపుస్తకాలలో పేరాలను గుర్తు పెట్టడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించినట్లు వెల్లడించింది.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో భాగమైన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ప్రశ్నలను బయటకు చేరవేసిన తీరును చార్జ్ షీట్ లో వివరించింది. కెమిస్ట్రీ నిపుణుడు పీ.వీ.కులకర్ణి, బోటనీ నిపుణురాలు మనీషా మాందరే, ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవల్దార్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 13 మందిలో వీరు కూడా ఉన్నట్లు తెలిపింది.
ఛార్జ్ షీట్ ప్రకారం ఎన్టీఏ కేంద్రంలో ప్రశ్నాపత్రాల రూపకల్పన, అనువాద ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిపుణులకు వివిధ విభాగాల్లోకి ప్రవేశం ఉండేది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారు ప్రశ్నలను గుర్తు పెట్టుకుని వాటిని చీటీలపై రాసుకుని వాటికి సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకాలలో మార్క్ చేసినట్టు తెలిపింది. ఆ తర్వాత తమ నెట్వర్క్లో ఉన్న మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా ఆ సమాచారాన్ని ఎంపిక చేసిన విద్యార్థులకు చేరవేసినట్టు సీబీఐ ఆరోపించింది.
Also Read: అసలు యూపీఐ అంటే ఏంటి? ఎలా పనిచేస్తోంది? ఉచిత సేవలకు అయ్యే ఖర్చెంత?
డిజిటల్ ఆధారాలు దొరకకుండా చూడటానికి మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాలను వినియోగించ లేదని తెలిపింది. పూర్తిగా చేతిరాత చీటీలు, గుర్తుపెట్టుకున్న సమాచారంపైనే ఆధారపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం ఆర్థిక లాభం పొందడమే కాకుండా, కోచింగ్ సెంటర్ల విజయశాతాన్ని పెంచడమని సీబీఐ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. పలు వ్యక్తులు కలిసి వ్యవస్థీకృతంగా ఈ రాకెట్ను నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీనికోసం టెలిగ్రామ్ యాప్ లోని పలు చానళ్లను ఉపయోగించుకున్నట్టు పేర్కొంది.
Also Read: రీల్స్ అలా చూశాడో లేదో.. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా.. ఇదో కొత్త రకం సైబర్ స్కామ్!