Portugal Job Scam: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ వివాహితను ఏకంగా బీర్ షాపు యజమానికి అమ్మేసిన దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన 28 ఏళ్ల మహిళను విదేశీ ఉద్యోగం పేరుతో మోసం చేసి.. పోర్చుగల్లో బందీగా మార్చారు. శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారు. బాధితురాలు ఎలాగోలా తప్పించుకొని ఇండియాకు తిరిగిరావడంతో.. అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో సదరు కన్సల్టెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి కథనం ప్రకారం.. పూణేకు చెందిన ‘వీ మైగ్రేట్’ (We Migrate) అనే కన్సల్టెన్సీ ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అది చూసి బాధితురాలు వారిని సంప్రదించింది. పోర్చుగల్లో క్యాషియర్గా ఉద్యోగం ఇప్పిస్తామని రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని ఉంటుందని కన్సల్టెన్సీ నిర్వాహకులు ఆమెతో చెప్పారు. నెలకు రూ. 1.5 లక్షల వేతనం వస్తుందని ఆమెకు ఆశ చూపారు. వీసా, ఇతర కాగితాల ప్రక్రియ పేరుతో విడతల వారీగా ఆమె వద్ద నుండి దాదాపు రూ.11 లక్షలు కాజేశారు.
డబ్బులు చెల్లించిన తర్వాత మహిళ పోర్చుగల్ చేరుకోగానే.. అక్కడి ఏజెంట్లు ఆమె పాస్పోర్ట్ను లాక్కున్నారు. రెండు రోజుల పాటు ఒక గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆమెను ఒక బీర్ షాపు యజమానికి విక్రయించారు. అక్కడ ఆమెతో బలవంతంగా పనిచేయించడమే కాకుండా విపరీతమైన మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు. తన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని కోరగా.. కేటుగాళ్లు మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు.
అలా నెలరోజులకు పైగా నరకయాతన అనుభవించిన బాధితురాలు.. ఎలాగైనా దీని నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ప్లాన్ లో భాగంగా మొదట బస్సులో లిస్బన్ చేరుకుని అక్కడి నుంచి మాడ్రిడ్కు వెళ్లింది. ఆ తర్వాత దోహా మీదుగా సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చింది. తిరిగి కన్సల్టెన్సీ నిర్వాహకుల వద్దకు వెళ్లగా.. వారి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. మాల్టాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆమెను మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దానికి ఆమె నిరాకరించడంతో, ఆమె భర్తను చంపేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు ఎదురు తిరిగి పూణే పోలీసులను ఆశ్రయించింది.
Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ
బాధితురాలి ఫిర్యాదు మేరకు ‘వీ మైగ్రేట్’ సంస్థపై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులతో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై మానవ అక్రమ రవాణా, మోసం కింద సెక్షన్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఏజెంట్లు మాటలు విని.. ఎవరూ మోసపోవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Also Read: భారత్కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!