Arunachalam Temple: తమిళనాడులోని అరుణాచలం ఆలయం (తిరువణ్ణామలై)లో తీవ్ర భద్రతా లోపం తలెత్తింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు ఇది చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనలకు దారి తీసింది. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా, మూల విగ్రహాలను ఫొటోలు తీశారన్న ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన భవనీష్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు.. ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత సాధారణ భక్తుల్లాగే వీరిద్దరు అరుణాచలం ఆలయంలోకి ప్రవేశించారు. అయితే వారు కెమెరా ఉన్న కళ్లద్దాలను ధరించడాన్ని భద్రతా సిబ్బంది తొలుత గమనించలేదు. దీంతో ఆ స్మార్ట్ గ్లాసెస్ ను ఉపయోగించి.. సీక్రెట్ గా ఆలయంలోని అరుణాచలేశ్వర స్వామి, ఉన్నాములై అమ్మవారి చిత్రాలను వారు తీసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్ లో ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు ఎదుటివారికి తెలిసేలా అందులో ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా కంపెనీలు ఈ సెక్యురిటీ ఫీచర్ ను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే మూల విరాట్ ను వారు ఫొటోలు తీస్తుండగా.. ఎల్ఈడీ లైట్ బ్లింక్ కావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై భవనీష్, మహేశ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెక్ చేయగా.. మూల విరాట్ ఫొటోలు కనిపించాయి. నిబంధనలకు విరుద్దంగా ఫొటోలు తీసినందున వారిని పోలీసులకు అప్పగించారు.
Also Read: భారత్కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!
ఇదిలా ఉంటే సాయంత్రం అమిత్ షా తిరువన్నామలై చేరుకొని.. అరుణాచల ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇలా భద్రతా లోపం బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న షా.. అనంతరం తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండ్రోజులు పర్యటించనున్నారు. సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఆయన తిరువన్నామలైకి చేరుకునే అవకాశముంది. సుమారు గంటసేపు ఆలయ పరిసరాల్లో ఆయన గడపనున్నారు. అనంతరం 6 గంటల ప్రాంతంలో పుదుచ్చేరికి బయలుదేరుతారని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!