Supreme Court on NEET paper leak(Telugu news headlines today): నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఈ పరీక్ష వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగనుంది. ఈ పరీక్షలో జరిగిన అవకతవకలు, మాల్ ప్రాక్టీసు, పేపర్ లీకేజీ వంటి వ్యవహారాల నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 8న విచారణ జరిపింది. అనంతరం జూలై 11కు వాయిదా వేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కీలక విషయాలు వివరించింది.
వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికి, విద్యార్థులు లబ్ధిపొందేలా అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, నీట్ యూజీ ఫలితాలపై డేటా ఆధారంగా మాల్ ప్రాక్టీస్పై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మద్రాస్ ఐఐటీని కోరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐఐటీ అధ్యయనం చేసిన నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
నీట్ యూజీ పరీక్షలో అనుమానిత కేసులను గుర్తించడం, అత్యుత్తమ పనితీరు కనబర్చిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనే విషయాలను మద్రాస్ ఐఐటీ అంచనా వేసింది. ఇందులో భాగంగా 2023, 2024 ఏడాదిలో టాప్ ర్యాంకులను మద్రాస్ ఐఐటీ విశ్లేషించింది. మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులకు లబ్ధి జరిగిందా అనే కోణంలో పరిశీలించింది. అయితే ఎలాంటి ఆధారాలు లేవని మద్రాస్ ఐఐటీ అభిప్రాయపడింది. సిలబస్ 25 శాతం తగ్గించడంతో ఫలితాలపై ప్రభావం చూపించినట్లుగా వెల్లడించింది.
Also Read: జైలులో నటుడు దర్శన్కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..
మార్కులు సాధారణంగానే ఉన్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. నీట్(యూజీ)పై ఇవాళ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ సమర్పించింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ, జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో కేంద్రం వెల్లడించింది.
విచారణ 18కి వాయిదా..
సుప్రీంకోర్టుకు కేంద్రం, ఎన్టీఏ అఫిడవిట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదులకు కేంద్రంచ ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా అందలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ వాదనలకు ముందు తమ ప్రతిస్పందనను తెలిపేందుకు వారికి సమయం కావాలని చెప్పింది. ఈ మేరకు నీట్ యూజీ 2024పై దాఖలైన పిటిషన్లపై విచారణను జూలై 18కి వాయిదా వేసింది.