Nitin Nabin: ఇటీవల కేరళలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ‘వందేమాతరం’ రగడ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనం
కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల నుంచి ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తిగా తొలగించడం అత్యంత తీవ్రమైన చర్య అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమ నీచమైన బుజ్జగింపు రాజకీయాల కోసం ఎంతటినికైనా తెగిస్తుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని ఆయన విమర్శించారు. తీవ్రవాద భావజాలం ముందు తలొగ్గడం కాంగ్రెస్కు ఇప్పుడు ఒక అలవాటుగా, శాశ్వత విధానంగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
స్వాతంత్ర్య సమరయోధులకు జరిగిన అవమానం
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ‘వందేమాతరం’ నినాదం ఒక ఊపిరిగా నిలిచింది. ‘వందేమాతరం’ అని నినదిస్తూ.. ఈ గీతాన్ని తమ పెదవులపై ఉంచుకుని వేలాది మంది వీరులు మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించారు. అలాంటి మహోన్నత గీతాన్ని అధికారిక వేడుకల నుంచి పక్కన పెట్టడం అంటే ఆ అమరవీరుల త్యాగాలను, స్వాతంత్ర్య సమరయోధులను ప్రత్యక్షంగా అవమానించడమేనని నితిన్ నబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశపారంపర్య అహంకారానికి పరాకాష్ఠ
ఇది కేవలం ఒక పాటను లేదా గీతాన్ని నిలిపివేయడం మాత్రమే కాదు. భారతదేశానికి గర్వకారణంగా నిలిచే ప్రతి సాంప్రదాయాన్ని, జాతీయ సంకేతాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో నిండివున్న ఆ వంశపారంపర్య అహంకారానికి, దేశభక్తి కంటే స్వార్థ రాజకీయాలే ముఖ్యం అనుకునే ధోరణికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని స్పష్టం చేశారు.
Also Read: జవాన్ల పిల్లల చదువు, వైద్యంపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. మంత్రి బండి సంజయ్ హామీ!