Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఘనత సశస్త్ర సీమా బల్ దేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఆధునిక పద్ధతుల్లో సరిహద్దు నిర్వహణను ఎస్ఎస్ బి ముఖ్యమైన ప్రాధాన్యతల్లో చేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.
జవాన్ల నివాస భవనాలకు ప్రారంభించిన కేంద్ర మంత్రి..
ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమా బల్ నూతనంగా నిర్మించిన 48 జవాన్ల నివాస భవనాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన గ్రుహ సముదాయాలను పరిశీలించారు. జవాన్లకు అందిస్తున్న సౌకర్యాలను, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రితోపాటు సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింఘాల్, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఎస్ఎస్ బీ జవాన్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ప్రాంగణంలో నిర్మించిన 48 ప్రత్యేక కుటుంబ నివాస గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నివాస గృహాల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ భద్రతను కాపాడే జవాన్ కుటుంబం సురక్షితంగా, గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించేలా చూడటం ప్రభుత్వం, సంస్థ బాధ్యత అన్నారు. జవాన్కు తన కుటుంబ భద్రత, సౌకర్యాల గురించి ఆందోళన లేకపోతే, అతను సరిహద్దు భద్రత, దేశ సేవపై పూర్తి దృష్టి పెట్టగలడన్నారు. అందుకే కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమం, వారికి మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం ముఖ్యమైన ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉందన్నారు.
జవాన్లకు తగిన నివాస సౌకర్యాలు..
జవాన్లకు తగిన నివాస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ తెలిపారు. సశస్త్ర సీమా బల్ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, ఆధునిక పద్ధతుల్లో సరిహద్దు నిర్వహణను తన ముఖ్యమైన ప్రాధాన్యతల్లో చేర్చుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్లో నిఘా, భద్రతను మరింత మెరుగుపరచడానికి డ్రోన్లు, నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, జీపీఎస్ ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ, జీఐఎస్ ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారని బండి తెలిపారు.
సైనికుల కుటుంబాలకు వైద్య, విద్య..
భవిష్యత్తులో కూడా ఈ బృందాలు ఇదే అప్రమత్తత, సేవాభావం మానవతా దృక్పథంతో దేశ ప్రజలకు సేవ చేస్తాయని ఆశిస్తున్నట్లు బండి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బలగాల ఆధునీకరణతో జవాన్ల సంక్షేమం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. సైనికుల కుటుంబాలకు మంచి వైద్య చికిత్స, ఆధునిక గృహ వసతి, అలాగే వారి పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఆధునిక పాఠశాలలు, క్రీడా పోటీలు నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు.. రేపు సుప్రీంకోర్టులో విచారణ