ఉత్తర భారతదేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి శక్తివంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో సంభవించిన 5.9 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9:50 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నోయిడా, చండీగఢ్, లూథియానా, శ్రీనగర్, డెహ్రాడూన్ వంటి నగరాల్లో నివసించే వారు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుండి భయం భయంగా బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం కేంద్రస్థానం ఆఫ్ఘనిస్థాన్లోని బదక్షాన్ ప్రావిన్స్లో పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయని సమాచారం. భారత్తో పాటు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, పెషావర్, పంజాబ్ ప్రావిన్స్లలో కూడా ఈ ప్రకంపనలు స్పష్టంగా వినిపించాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు.
ఎత్తైన భవనాల్లో నివసించే వారు భూకంపం వచ్చినప్పుడు ఇంట్లోని ఫ్యాన్లు, మంచాలు, ఇతర వస్తువులు బలంగా ఊగాయని తెలిపారు. చండీగఢ్కు చెందిన బలదేవ్ చంద్ అనే నివాసి మాట్లాడుతూ.. తాను రెండో అంతస్తులో ఉన్నప్పుడు కొన్ని సెకన్ల పాటు బలమైన కుదుపులను అనుభవించానని పేర్కొన్నారు. సోషల్ మీడియలో వైశాలి పొద్దార్ అనే యూజర్ స్పందిస్తూ.. కాశ్మీర్లో ఇంతకు ముందెన్నడూ లేనంత బలమైన ప్రకంపనలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఒకవైపు అకాల వర్షం కురుస్తుండగా మరోవైపు భూకంపం రావడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: నింగిలో 1,000 కి.మీ భారీ మేఘమాల.. ఉత్తర భారతంలో వర్షాల బీభత్సమేనా?