PM Modi : పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచీ ఒక్కటే డిమాండ్. పాక్కు బుద్ధి చెప్పడం. పీవోకే స్వాధీనం చేసుకోవడం. అఖండ భారత్ అనేది 140 కోట్ల మంది భారతీయుల డ్రీమ్. పాకిస్తాన్తో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా పీవోకే హాట్ టాపిక్ అవుతుంది. ఆపరేషన్ సిందూర్ టైమ్లోనూ అదే చర్చ జరిగింది. లేటెస్ట్గా గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సైతం పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడారు.
1947లోనే చేయాల్సింది..
ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు 1947లోనే చెక్ పెట్టాల్సిందని.. కానీ అప్పుడు అలా జరగలేదన్నారు. అందుకే ఇప్పటికి కూడా ఈ సమస్య భారత్ను వెంటాడుతోందన్నారు.
పటేల్ చెప్పింది చేసుంటే..
1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజే భారత్పై దాడి జరిగిందన్నారు ప్రధాని మోడీ. కశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగిందని.. అప్పుడు కశ్మీర్లోని భూభాగాన్ని పాకిస్తాన్ ముజాహిదీన్ పేరుతో ఆక్రమించిందన్నారు. అదే ఇప్పుడు POKగా మారిందన్నారు. ఆ రోజు ముజాహిదీన్ల నుంచి కశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించకూడదని సర్దార్ పటేల్ కోరారని గుర్తు చేశారు. కానీ సర్దార్ మాటలను అప్పటి ప్రధాని, ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు మోడీ.
ఉగ్రవాదం పాక్ వ్యూహం
గత 75 సంవత్సరాలుగా ఉగ్రవాదుల రక్తపాతం కొనసాగుతోందన్నారు మోడీ. పర్యాటకులు, పౌరులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. పహల్గాం దాడి సైతం అందుకు ఓ ఉదాహారణ అన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూమంగా అనుసరిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. యుద్ధం చేసిన ప్రతిసారీ పాక్కు ఓటమే దక్కిందని.. అందుకే పాక్ ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతుందన్నారు.
టెర్రరిస్టులకు సెల్యూట్ చేస్తారా?
పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలను అక్కడి ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపిందని మండిపడ్డారు. పాక్ ఆర్మీ సైతం టెర్రరిస్టులకు సెల్యూట్ చేసిందని చెప్పారు. ఉగ్రదాడులతో భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే భారత్ చూస్తూ ఉండబోదంటూ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ.