Diamonds in Water: ఇటీవల ఏపీలో ఎవరి నోట విన్నా వజ్రాల మాటే. మాటలు ఏమో కానీ కొందరు వజ్రాలు దొరికి మూటలు కట్టుకుంటున్నారని ప్రచారం. కర్నూల్ జిల్లాలో అయితే ఓ రైతు పంట పండిందని జోరు ప్రచారం. ఇన్ని ప్రచారాల మధ్య ఇప్పుడు ఏపీ వజ్రాల మూట అంటూ ప్రచారం సాగుతోంది. అలా వర్షం కురవడం ఆలస్యం లేదు, ప్రజలు వజ్రాల వేటకు వెళుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఈ తరుణంలో మరో కొత్త విషయం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.
వాగు కాదట.. వజ్రాల మూట
ఏపీలోని ఓ వాగు ఇప్పుడు తెగ ప్రచారంలోకి వచ్చింది. ఆ వాగు పేరెత్తితే చాలు, వజ్రాల వాగు అనేస్తున్నారు ప్రజలు. గతంలో ఈ వాగులోకి వెళ్లి మరీ వజ్రాల వేట సాగించారు అక్కడి స్థానికులు. ఓ వైపు నీటి ప్రవాహం సాగుతుండగానే అక్కడ వజ్రాల శోధన సాగింది. ఆ తర్వాత నీటి ప్రవాహం ఆగగానే, మళ్లీ అక్కడి మట్టి తుంపరలలో వజ్రాలు దొరికాయని ప్రచారం జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆ వజ్రాల వాగు ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇక అసలు విషయంలోకి వెళితే..
ఏపీ నంద్యాల జిల్లాలోని గాజులపల్లె సమీపంలోని నల్లమల అడవుల్లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులకు పవిత్ర క్షేత్రంగా మాత్రమే కాదు, ఇటీవల కొన్ని ప్రచారాల కారణంగా విలువైన వజ్రాల ఊసు కూడా తీసుకొస్తోంది. ఈ ఆలయం పక్కన పారే వాగు నీటిలో వజ్రాలు దొరుకుతున్నాయట అనే మాట స్థానికంగా చక్కర్లు కొడుతోంది.
నరసింహ క్షేత్ర విశిష్టత
గాజులపల్లె సమీపంలోని ఈ నరసింహ స్వామి ఆలయం నల్లమల అడవుల మధ్యలో, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా వెలసిన ఒక అరుదైన క్షేత్రం. ఇది పూర్తిగా గుట్టల మధ్య, చెట్ల కప్పుదాలలో ఉంటూ, శాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి భక్తులు చాలామంది పాదయాత్రగా వస్తూ స్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రం చుట్టూ ప్రాచీనంగా కొన్ని జానపద నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయం పక్కన ప్రవహించే వాగు, ఇది సాధారణంగా వర్షాకాలంలోనే జలంతో నిండి ప్రవహిస్తుంది. దీనిపై కొన్ని ఆసక్తికరమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి.
వజ్రాల వాగు ప్రచారం.. నమ్మకమా? నిజమా?
గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా ఒక ప్రచారం బలంగా వినిపిస్తోంది. అది ఏంటంటే ‘‘ఆ వాగులో వజ్రాలు వెలుతుంటాయి. కొందరు తవ్వి తీసుకొంటున్నారన్నది ఆ ప్రచారం. వాగులో ప్రవహించే నీటికి వెంట్రుకల్లాంటి మెరుపులు ఉంటున్నాయని, కొంతమంది రాత్రిపూట వచ్చినప్పుడు చిన్న చిన్న రాళ్లు మెరిసినట్టు కనిపించాయని చెప్పిన మాటలు ఇక్కడ వినిపిస్తుంటాయి. ఇది విన్న భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి మరింత ఉత్సుకతతో వస్తున్నారు. కొంతమంది ఇక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. కానీ వాగు నీటి ప్రవాహం సమయంలో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అక్కడి స్థానికులు నిరంతరం తెలుపుతుంటారు.
చరిత్రను చూసినా..
నల్లమల, రాయలసీమ ప్రాంతాలు పూర్వం నుంచీ వజ్రాల తవ్వకాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా కర్నూల్, బంజర్పహాడ్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో వజ్రాలు దొరికిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంతో నల్లమల అడవుల్లోనూ వజ్రాలున్నాయన్న విశ్వాసం జనంలో నాటుకుపోయింది. అయితే గాజులపల్లె వాగు విషయంలో మాత్రం ఏ ప్రభుత్వ సంస్థ అయినా, భారత భూగర్భ శాఖ అయినా, ఖనిజ శాఖ అయినా వజ్రాల లభ్యతపై ఎలాంటి ధృవీకరణ చేయలేదు.
Also Read: AP Rains: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక.. ఆ జిల్లాలలో వర్షం ఆగేదేలేదట!
శాస్త్రీయంగా ఏమంటుంది?
వజ్రాలు ఏర్పడాలంటే భూగర్భంలో కొన్ని ప్రత్యేకమైన రసాయనిక ధాతువులు, అధిక ఒత్తిడి, శతాబ్దాల తరబడి భూమి కదలికలు ఉండాలి. వజ్రాలు సాధారణంగా కింబర్లైట్ పైప్స్ అనే భూగర్భ రంధ్రాల్లో లభిస్తాయి. అలాంటి శాస్త్రీయ పరిస్థితులు గాజులపల్లె వాగు ప్రాంతంలో ఉన్నట్లు ఇప్పటివరకు రుజువు కాలేదు. కాబట్టి వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం పూర్తి స్థాయిలో నమ్మదగినది కాదు, కానీ ప్రాచీన విశ్వాసాల పరంగా మాత్రమే ఉందని చెప్పవచ్చు.
భక్తి, ప్రకృతిని పరిరక్షించుకోవడమే పెద్ద పుణ్యం
గాజులపల్లె నరసింహ స్వామి ఆలయం వద్దకి వచ్చే భక్తులు, వజ్రాల ఆశతో కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసంతో రావడం మంచిది. ప్రకృతిని ప్రేమించాలి, అడవిని గౌరవించాలి. వాగుల్లో దిగి తవ్వకాలు చేయడం మానుకోవాలి. ఇది విలువైన భక్తి స్థలం. అక్కడి వాతావరణం, గుట్టల మధ్య ఉన్న ఆలయం మన మనసుకు శాంతినిస్తాయి.
ప్రకృతిని చూసి మెచ్చుకోవడం ఎంతో గొప్ప దైవతత్వమే. వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం నమ్మకానికి మాత్రమే పరిమితం. గాజులపల్లె ఆలయానికి ఈతరం యువత, పర్యాటకులు, భక్తులు వస్తున్నారు. కానీ వాస్తవాలు తెలుసుకొని, చట్టాన్ని గౌరవిస్తూ, ప్రకృతి – ఆధ్యాత్మికతల మధ్య ఒక సమతౌల్యం పాటించాలి. ఏదిఏమైనా వర్షం కురిస్తే చాలు, వాగు గుండా వజ్రాలు పోతుంటాయన్న విశ్వాసం మాత్రం ఇక్కడి ప్రజల్లో నాటుకుపోవడం విశేషం.