Police Office Life Sentence| ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఓ సీనియర్ పోలీస్ అధికారికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త దేశ వ్యప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా పోలీసు హత్య కేసులో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ ఈ తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని పన్వేల్ ప్రాంతం సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జడ్జి కెఆర్ పాల్డెవార్ మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ అభయ్ కురుంద్కార్ ను 2016 సంవత్సరంలో తన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశ్విని బిడ్రె (37) ని దారుణంగా హత్య చేసినందుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే 2016లో మహిళా పోలీస్ హత్య జరిగితే.. 2017లో పోలీస్ అధికారి అయిన అభయ్ కురుంద్ కార్ కు రాష్ట్రపతి పురస్కారం లభించడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్స్పెక్టర్ అభయ్ కురుంద్కార్ తన అసిస్టెంట్ పోలీస్ అధికారి అయిన అశ్వినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వీరిద్దరికీ ఇంతకుమునుపే వివాహం జరిగింది. ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు.
మృతురాలు ఇన్స్పెక్టర్ అశ్విని బిడ్రె 2005లో ఇంజినీర్ అయిన రాజు గోరె ని వివాహం చేసుకున్నారు. రాజు గోరె ఒక రైతు, సామాజిక కార్యకర్త కూడా. వారిద్దరికీ ఒక కూతరు పుట్టింది. అయితే అశ్విని తన సీనియర్ ఇన్స్పెక్టర్ అయిన అభయ్ కురుంద్కార్ ను ప్రేమించి.. అతను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ తీసుకుంటే తను కూడా అదే ప్రాంతానికి ఉద్యోగం ట్రాన్స్ఫార్ తీసుకుంది. 2014 నుంచి వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది.
అయితే 2016లో అనుకోకుండా ఇన్స్పెక్టర్ అశ్విని కనిపించకుండా పోయింది. దీంతో ఆమె నుంచి ఎటువంటి ఫోన్లు, ఉత్తరాలు రాకపోవడంతో ఆమె భర్త రాజు గోరె మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ ఆమె పని చేసే చోట అభయ్ కురుద్ కార్ ఇన్ చార్జిగా ఉండడంతో విచారణ సరిగా జరగలేదు. దీంతో రాజు గోరె కోర్టులో తన భార్య మిస్సింగ్ కేసులో విచారణ జరగడం లేదని కేసు నమోదు చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ అశ్విని బిడ్రె మిస్సింగ్ కేసు విచారణ కోసం కోర్టు ప్రత్యేక పోలీస్ బృందం చేత చేయించాలని ఆదేశించింది.
ఇన్స్పెక్టర్ అశ్విని మిస్సింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ చేయగా.. ఆమెకు తన సీనియర్ ఇన్స్పెక్టర్ అభయ్ కురుంద్కార్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. చివరి సారిగా ఆమె ఇంటికి ఇన్స్పెక్టర్ అభయ్ కురుంద్కార్ వెళ్లాడని ఆ తరువాత నుంచి ఆమెను ఎవరూ చూడలేదని తెలిసింది. దీంతో ఇన్స్పెక్టర్ అభయ్ కురుంద్కార్ ను 2017లో సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మూడు నెలల క్రితం ఇన్స్పెక్టర్ అశ్విని మృతదేహాన్ని ఊరి చివర ఒక నదిలో ఒక ట్రంకు పెట్టెలో పెట్టి న్స్పెక్టర్ అభయ్ తన ఇద్దరు స్నేహితుల సాయంతో విసర్జించాడని పోలీసుల విచారణలో తేలింది.
ఆ తరువాత ఆయనను ప్రశ్నించగా.. నిజాలు క్రమంగా వెలుగులోకి వచ్చాయి. ఇన్స్పెక్టర్ అశ్వినితో తనకు అక్రమ సంబంధం ఉన్నది నిజమేనని.. అంగీకరించారు. ఇన్స్పెక్టర్ అశ్విని తనను వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి చేసేదని అందుకే ఆమెను చంపాల్సి వచ్చిందని తెలిపాడు.
Also Read: పెళ్లిలో మోసం.. వధువుగా పెళికూతురు తల్లి.. వరుడికి బెదిరింపులు
కోర్టులో దాదాపు 8 సంవత్సరాల పాటు విచారణ సాగిన ఈ కేసులో ఏప్రిల్ 21న కోర్టు తీర్పు వెలువరిచింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసికూటర్ ప్రదీప్ ఘారత్ వాదిస్తూ.. ఇన్స్పెక్టర్ అశ్విని హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని ముక్కలుగా నరికి ఒక పెట్టెలో పెట్టి విసర్జించారని.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఇన్స్పెక్టర్ అభయ్ కు మరణ శిక్ష విధించాలని కోరారు. కానీ న్యాయమూర్తి జడ్జి కెఆర్ పాల్డెవార్ ఆయన వాదనతో అంగీకరించలేదు. ఇంతకుముందు కూడా ఇలాంటి హత్యలు జరిగాయని ఆ కేసుల్లో దోషికి మరణ శిక్ష విధించలేదని.. పైగా ఇన్స్పెక్టర్ అభయ్ భార్య మరణం తరువాత తన అసిస్టెంట్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆయనకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. ఈ కేసు మినహా పోలీస్ విభాగంలో ఆయన పనితీరు కూడా బాగుంది. ఆయన వయసు రీత్యా తాను చేసిన తప్పును ఆయన అంగీకరించాడు. ఈ కారణాలతో ఆయనకు జైలు శిక్షనే సరియైనదని.. అందుకే ఆయనకు జీవితకాలం ఖైదు శిక్ష విధిస్తున్నానని చెప్పారు.