Puja Khedkar Reaction after allegations: పలు డిమాండ్లు చేస్తూ వివాదాస్పదంగా మారిన తరువాత ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ఈ అంశంపై తనకు మాట్లాడేందుకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. నిబంధనలు అనుమతించవు క్షమించండంటూ ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని వాసిమ్ లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉందన్నారు.
పుణెలో బ్యూరోక్రాట్ గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర పలు డిమాండ్ల కారణంగా ఖేద్కర్ వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేట్ ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్ కు బదిలీ చేసింది. అయితే, వాస్తవానికి ప్రొబేషన్ లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు ఉండవు.
ఈ సౌకర్యాల కోసం ఆమె కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు కూడా ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు డిమాండ్లు చేస్తూ.. తాను వచ్చేవరకు వాటిని పూర్తి చేయాలంటూ ఆదేశించారు.
Also Read:వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. హోటల్ గదుల్లో ఎమ్మెల్యేలు ఖైదు!
అదేవిధంగా తాజాగా ఆమెకు సంబంధించిన మరికొన్ని వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చినట్లు పలు వార్తా కథనాలు కూడా వచ్చాయి. వాటిని నిర్ధారించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఆమె ఏకంగా ఆరుసార్లు డుమ్మా కొట్టినట్లు సమాచారం.