Nawab Ali Nawaz Jung Bahadur: ఈ రోజు తెలంగాణ ఇంజినీర్స్ డే. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినమైన జులై 11వ తేదీని రాష్ట్ర ఇంజినీర్స్ డే గా ప్రభుత్వం ప్రకటించింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయగా.. అప్పటి నుంచి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇంతకీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఎవరు? ఆయన ఎందులో నిష్ణాతుడు? ఇంజీనీర్గా ఆయన సృష్టించిన అద్భుతాలేమిటీ? వంటి ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.
నిజాం ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేసిన మిర్ వాయిజ్ అలీకి 1877 జులై 11న జన్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్, మద్రాసా ఆలియాలో చదివిన తర్వాత హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదివారు. 1896లో ప్రభుత్వ స్కాలర్షిప్ పై ఇంగ్లాండ్లోని ప్రముఖ కూపర్స్ హిల్ కాలేజీలో చేరారు. అక్కడ అద్భుత ప్రతిభ కనబరిచి 1899లో తిరిగి వచ్చి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజినీర్గా చేరారు. 1918లో చీఫ్ ఇంజినీర్, సెక్రెటరీగా పదోన్నతి పొందారు. ఆయన నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు ఇప్పటికీ నిలిచాయి. ఇప్పటికీ సాగునీరును అందిస్తున్నాయి. ఆయన ముందుచూపుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు, నిజాం షుగర్ ఫ్యాక్టరీలను నిర్మించి నిజామాబాద్ ముఖచిత్రాన్ని మార్చేశారు. మూసీ ప్రాజెక్టు, చంద్రసాగర్, నందికొండ, పెండ్లిపాకల, రాజోలీబండ, సరళాసాగర్, భీమా, అప్పర్ మానేర్ ప్రాజెక్టు, మహారాష్ట్రలోని పూర్ణ ప్రాజెక్టు, పెన్గంగాపైనా ప్రాజెక్టులు నిర్మించారు.
ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రఖ్యాత ప్రాజెక్టులు నిర్మించారు. ఖమ్మంలోని పాలేరు జలాశయం, వైరా జలాశయం కూడా ఈయన పర్యవేక్షణలో నిర్మితమైనవే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్ గంజ్ లైబ్రరీ, యునానీ హాస్పిటల్, నాందేడ్లోని సివిల్ హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ కూడా ఈయన నిర్మాణాలే.
తెలంగాణ ఇంజనీర్స్ డే జులై 11
తెలంగాణ ప్రముఖ ఇంజనీర్ శ్రీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ గారు నీటి పారుదల రంగంలో అందించిన సేవలు చిరస్మరణీయం.
వారి జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వామ్యులైన ఇంజనీర్లకు… pic.twitter.com/VoiTIOsWeH— Telangana Congress (@INCTelangana) July 11, 2024
బాంబే ప్రభుత్వ పిలుపు మేరకు పాకిస్తాన్లోని సుక్కూర్ బ్యారేజీ కోసం కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి వెళ్లి పని చేశారు. ఈ బ్యారేజీకి సంబంధించి ఆర్థిక, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారాలు చూపారు. జఠిలమైన వివాదాలను పరిష్కరించడంలోనూ అలీ నవాబ్ జంగ్ బహదూర్ది అందె వేసిన చేయి. మద్రాస్, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య వచ్చిన నీటి వివాదాన్ని కూడా ఈయనే పరిష్కరించారు. ఈయన చేసిన కృషికి గుర్తుగానే నిజామాబాద్లో నినర్మించిన అలీ సాగర్ డ్యామ్కు ఈయన పేరే పెట్టారు.