Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తామన్న మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటరిచ్చారు. లెక్కలు వేసుకుంటే గెలుపు రాదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం ఖాయమన్నారు. ప్రజలకు ఓ బిగ్ సర్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. విపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మోదీకి కేవలం విభజన రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. ఆ విధమైన చర్యలు దేశ పరువును దెబ్బతీస్తాయని చెప్పారు. ఇక కొద్ది నెలల్లో మరో నాలుగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని.. అక్కడ కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని స్పష్టం చేశారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుంటే.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
పరువునష్టం కేసులో దోషిగా తేలినందుకే.. తనపై అనర్హత వేటు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే పార్లమెంట్ లో అదానీ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాతే ఈ వేటు పడటం కాస్త విచిత్రంగా ఉందని చెప్పారు. అయితే తనకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని.. ఒకరకంగా చెప్పాలంటే ఆ అనర్హతవేటు పడటం తనకు అడ్వాంటేజే అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు.. ఆ అంశాలే దోహదపడ్డాయన్నారు. కేవలం కార్పొరేట్లకు కాకుండా.. చిన్న,మధ్య,తరహా పరిశ్రమలకు సహకారం అందిస్తేనే దేశంలో అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు రాహుల్ గాంధీ. భారత్ లో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయని చెప్పారు రాహుల్ గాంధీ. మోదీ పాలనలో కొన్ని సంస్థలు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ సంస్థలకు మరింత స్వేచ్ఛనిస్తామని స్పష్టం చేశారు.
చిన్నమధ్య తరహా పరిశ్రమలతోనే భారత్ అభివృద్ధి సాధ్యమన్నారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ అలాంటి పరిశ్రమలను కాకుండా.. కేవలం కార్పొరేట్లకే వంత పాడుతుందని విమర్శించారు. యూపీఏ హయాంలోనే భారత్ లో అభివృద్ధి సాధ్యమైందన్నారు.