Rahul IN Pune: మహిళలు కేవలం తల్లి, భార్య, కుమార్తె పాత్రలకు పరిమితం కాకూడదని అన్నారు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ. ప్రతి దశలో పురుషుల ఆధిపత్యం కింద ఉండాలని పేర్కొన్న మనుస్మృతి నియమం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహిళలు స్వతంత్రంగా ఉండటం, తమ కోసం తాము నిలబడటం, తమను తాము విశ్వసించడం దేశానికి అతిపెద్ద బలంగా వర్ణించారు. జంతర్ మంతర్ దగ్గర అమ్మాయిలను దుర్భాషలాడటం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని గుర్తు చేశారు. అది మనుస్మృతి మనస్తత్వానికి నిదర్శనమన్నారు.
పూణేలోని ఏఐఎస్ఎస్ఎంఎస్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ ‘స్కూల్ కీ గూంజ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళల భద్రత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పంజరం నుంచి యువత బయటకు రావాలని పిలుపునిచ్చారు. పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలన్నారు. పురుషులతో పోలిస్తే సహజంగా మహిళలు సున్నితత్వంగా ఉంటారన్నారు. మహిళలకు మూడు రకాలుగా గుర్తింపు దక్కుతోందన్నారు. కుమార్తె, భార్య, తల్లిగా గుర్తిస్తున్నారని, ఆ బంధాల్లో తప్పులేదన్నారు. అదొక్కటే వారి గుర్తింపుగా ఉండకూడదన్నారు.
వృత్తి నిపుణులుగా, క్రీడాకారులుగా, ఎన్నో రంగాల్లో క్రియాశీలంగా ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. వారి గుర్తింపును పురుషులతో ముడిపెట్టి చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తెరపై ప్రదర్శించారు. దేశానికి అతిపెద్ద బలం 70 కోట్ల మంది మహిళలని అన్నారు. అబ్బాయిలు అభ్యంతరకర భాష వాడితే నోరు ఎత్తరని, ఆ మాటలు అమ్మాయిలు మాట్లాడితే సాంస్కృతిక షాక్ అని తప్పుపడతారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం సొసైటీలో మహిళలు మూడు రకాల హింసకు గురవుతున్నారని వివరించారు. భౌతిక హింస, అవకాశాలను నిరాకరించడం ద్వారా హింస, ఆర్థిక హింస వంటివి ఉన్నాయన్నారు.
దేశంలో ఏటా 4.5 లక్షల భ్రూణ హత్యలు జరుగుతున్నాయని డేటా బయటపెట్టారు. 80 శాతం మంది వేధింపుల బారినపడుతున్నారని, 29 శాతం మంది భౌతిక హింసకు గురవుతున్నారని వివరించారు. ఆరు శాతం మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయని నొక్కి వక్కానించారు. 99 శాతం లైంగిక వేధింపుల కేసులు బయటకు రాలేదన్నారు. దేశంలో 60 శాతం మంది మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు ఇంట్లో సగటు రోజుకు 5.5 గంటలు పని చేస్తున్నారని, అబ్బాయిలు కేవలం 30 నిమిషాలకు మంచి పని చేయలేదన్నారు.