Pirate Hijackings: సముద్రపు దొంగలు నౌకలను హైజాక్ చేశారనే వార్త కలకలం రేపుతోంది. మొదటి ఘటన ఆగస్టు 17న సోమాలియా తీరంలో జరిగింది. కామెరూన్ పతాకంతో వెళ్తోన్న లుటుఫ్ అనే కార్గో నౌకను.. దొంగలు హైజాక్ చేశారు. సోమాలియా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. పంట్ల్యాండ్లోని ఐల్ జిల్లా మర్రాయా తీరానికి మూడున్నర నాటికల్ మైళ్ల దూరంలో.. ఈ నౌక దొంగల చేతికి చిక్కింది. ఇందులో పది మంది సిబ్బంది ఉండగా.. ఆరుగురు భారతీయులు. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు. ఈ నౌక తుర్కియే ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను మొగదిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి తరలిస్తోంది. ఎనిమిది మంది సాయుధ దొంగలు.. ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందం ఏప్రిల్లో స్వార్డ్ నౌకను హైజాక్ చేసిన ముఠాకు చెందినదని అనుమానిస్తున్నారు. లటుఫ్ నౌక చుట్టూ రెండు నౌకలు మోహరించాయి. తుర్కియే హెలికాప్టర్లు, డ్రోన్లు.. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాయి. వైమానిక దాడిలో నలుగురు దొంగలు మృతి చెందరాని అధికారులు తెలిపారు.
ఆరుగురు సాయుధ దొంగలు హైజాక్..
ఇక రెండో ఘటన.. ఆగస్టు 20న యెమెన్ తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో జరిగింది. ఎరిట్రియా జెండాతో వెళ్తోన్న ఎంటీ సిబు-1 అనే చమురు ట్యాంకర్రు.. ఆరుగురు సాయుధ దొంగలు హైజాక్ చేశారు. ఇందులో 20 మంది సిబ్బంది ఉంటే.. అందులో 16 మంది భారతీయులు ఉన్నారు. మిగిలిన వారు సిరియా, సూడాన్, ఇరాక్కు చెందినవారు. వీళ్లంతా ఇప్పుడు పైరేట్స్ చెరలోనే ఉన్నారు. ప్రస్తుతం భారత సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని డైరెక్టరేట్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని.. నావికులను క్షేమంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. అయితే, భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక స్పందన రాలేదు. 22 భారతీయ కుటుంబాలు.. తమవారు క్షేమంగా తిరిగిరావాలని ఎదురుచూస్తున్నాయ్.
Also Read: బీసీ రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా కుట్ర? వి. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు!