Turbine Blast: జార్ఖండ్లోని రామగఢ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హెహల్ ప్రాంతంలో ఉన్న పవర్ ప్లాంట్లో టర్బైన్ ఉన్నపళంగా పేలిపోవడంతో ముగ్గురు ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్లాంట్లో రోజువారీ పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరగడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
అసలేం జరిగింది?
హెహల్లోని పవర్ ప్లాంట్లో శనివారం టర్బైన్ విభాగానికి సంబంధించి పనులు సాగుతున్నాయి. అయితే, సాంకేతిక లోపం వల్ల టర్బైన్ సెక్షన్లో తీవ్ర స్థాయి ఓవర్హీటింగ్ ఏర్పడింది. చూస్తుండగానే క్షణాల్లో పెద్ద శబ్దంతో టర్బైన్ పేలిపోయింది. ఆ వెంటనే ప్లాంట్ ప్రాంగణమంతా భారీగా మంటలు, దట్టమైన పొగ అలుముకున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మంటలు వేగంగా విస్తరించాయి.
తీవ్ర విషాదం.. ఆస్పత్రిలో మరొకరు
ఈ ప్రమాదంలో ప్లాంట్ షిఫ్ట్ ఇంచార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ కుమార్ కేసరితో పాటు వినీత్ మహతో, అభిషేక్ అనే ముగ్గురు ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉన్న రవాని అనే తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంట వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన రవానిని మెరుగైన వైద్యం కోసం రాంచీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అగ్నిప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. పవర్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
Also Read: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. రన్వేను తాకిన వెనుక భాగం, 216 మంది సురక్షితం!