Uttar Pradesh: టెక్ యుగంలో ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయి. కుటుంబం పరువు కోసం మేనకోడల్ని అత్యంత దారుణంగా చంపేశాడు సొంత మేనమామ. అంతేకాదు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. ఆత్మ వెంటాడకుండా ఉండేందుకు రెండు కాళ్ళకు మూడేసి మేకులు దింపాడు. శవంతోపాటు ఉప్పు ప్యాకెట్లను అందులో ఉంచాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలోని బరేలీలో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది?
యూపీలో బరేలీలోని అనిరుధ్పూర్ గౌడియా గ్రామంలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. కుటుంబం పరువు కోసం మేనమామ జైప్రకాష్, మైనర్ మేనకోడల్ని అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపాడు. జైప్రకాష్ మేనకోడలు సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిందని తెలుసుకున్నాడు. మేనకోడలితో సదరు యువకుడు రెండుసార్లు కనిపించాడు. ఈ విషయంలో మేనకోడలికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నిరాకరించిందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. వారు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆ మైనర్ వినలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన మేనమాన జై ప్రకాశ్, కుటుంబం పరువుపై మేనకోడల్ని హత్య చేశాడు.
మృతదేహాన్ని వ్యవసాయ పొలంలో పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని ట్యూబ్వెల్ ఛాంబర్లో ఉంచి తాళం వేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళాడు. కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తన ప్రియుడితో వెళ్లిపోయి ఉంటుందని కుటుంబసభ్యులను నమ్మించాడు జైప్రకాశ్. ఓ రోజు తర్వాత నిందితుడు ట్యూబ్వెల్ చాంబర్ నుండి మృతదేహాన్ని బయటకు తీసి పొలంలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. మేనకోడలు మృతదేహానికి రెండు కాళ్ళలో మూడేసి మేకులు దింపి, శవంతోపాటు ఉప్పు ప్యాకెట్లను అందులో ఉంచి ఊడ్చిపెట్టాడు. మృతదేహం త్వరగా కుళ్ళిపోయేలా చేయడానికి ఉప్పు వేసినట్టు తెలిపాడు నిందితుడు.
మేనకోడలు ఆత్మ తనను వెంటాడుతుందనే మూఢనమ్మకంతో ప్రకాష్.. పాదాలకు ఆరు మేకులు కొట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోస్ట్మార్టం పరీక్షలో ఆ మేకులు బయటపడ్డాయి. కొన్ని రోజులుగా యువతి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో హత్యకు గురై ఉంటుందని భావించాడు యువతి ప్రియుడు. చివరకు అమ్మాయి ప్రియుడు పోలీసు అధికారులను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. యువతి అదృశ్యమైన దాదాపు 18 రోజుల తర్వాత మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితుడైన మేనమామ జైప్రకాష్ను అరెస్టు చేసిన కోర్టు ఆదేశాల మేరకు జిల్లా జైలుకు పంపారు.
ALSO READ: చంద్రుడి సీక్రెట్ గుహల్లోకి దూకే విచిత్ర రోబో! చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి?