Nagpur Aurangzeb Violence Local Elections | మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని (Aurangzeb grave) కూల్చివేయాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై నాగ్పూర్లో (Nagpur) రెండు వర్గాల మధ్య హింస చెలరేగి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై ఆర్ఎస్ఎస్ తాజాగా స్పందించింది.
“మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం నాగ్పూర్లో తీవ్ర ఘర్షణలకు దారితీసింది. అసలు ఈ సమాధి నేటికి సంబంధించినది కాదు. ఈ హింస సమాజానికి హానికరం” అని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్లతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది ఉద్రిక్తతగా మారడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది.
Also Read: నాగ్పూర్ హింసకు ఛావా కారణం.. మోదీనే గత జన్మలో ఛత్రపతి శివాజీ
మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా, ఈ ఘర్షణల్లో కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి ఫోటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు ఎఫ్ఐఆర్లోని వివరాలను చూస్తే తెలుస్తుంది. దీంతో 51 మందిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే హింసపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
స్థానిక ఎన్నికల కోసమే ఈ రచ్చ
మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి తొలగింపుపై చెలరేగిన హింస తర్వాత, నాగ్పూర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లక్డ్గంజ్, పచ్పావోలి, శాంతి నగర్, సక్కర్దార్, నందన్వన్, ఇమామ్బాడ్, యశోధర నగర్, కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అదే రోజు సాయంత్రం మధ్య నాగ్పూర్లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్పడిన మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సెంట్రల్ నాగ్ పూర్ చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్లో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో హింస చెలరేగింది.
ఒక మతవాద సంస్థ ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం చేపట్టిన ఆందోళనలో మరో మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో నాగ్ పూర్లో అల్లర్లు చెలరేగాయి. నగరంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుంచి గంట సేపు ఇరు వర్గాల మధ్య ఇరు వర్గాల దాడులకు పాల్పడ్డాయి. అనేక వాహనాలను ఒక అల్లరి మూక తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలలో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది.
నాగ్పూర్లో అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– సామాజిక కార్యకర్త
నాగ్పూర్లో జరిగే హింస ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. “కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే, ఇప్పుడు బిజేపీకి దాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా” అని వ్యాఖ్యానించారు.