Raghav Chadha Vs AAP: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ ఉపనేతగా ఉన్న ఎంపీ రాఘన్ చడ్డాను.. ఆ పదవి నుంచి పార్టీ తొలిగించింది. దీంతో రాఘవ్ చడ్డా, ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎంపీ రాఘవ్ చడ్డా వీడియోకు ఆప్ కౌంటర్ ఇచ్చింది. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే సమోసాలపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. అయితే తనను అణచివేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోందని చద్దా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీనిపై ఏఏపీ స్పందిస్తూ.. రాఘవ్ చడ్డా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నారని ఎద్దేవా చేసింది. ప్రజా సమస్యలపై కాకుండా సమోసాల గురించి చర్చిస్తూ పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా చేశారని ఆరోపించింది.
రాఘవ్ చడ్డా గత కొన్నేళ్లుగా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నారని ఆమ్ ఆద్మీ ఆరోపించింది. నిజమైన సమస్యలను ప్రశ్నించడానికి భయపడుతున్నారని ఆప్ జాతీయ మీడియా చీఫ్ అనురాగ్ ధండా అన్నారు. గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎంపీ రాఘవ్ చడ్డాను రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది.
పార్లమెంటులో చడ్డా వ్యవహరిస్తున్న తీరును అనురాగ్ విమర్శించారు. సభలో మాట్లాడటానికి పార్టీకి చాలా తక్కువ సమయం లభిస్తుందని, దానిని జాతీయ సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగించుకోకుండా.. అనవసరమైన విషయాలను ప్రస్తావిస్తు్న్నాని మండిపడ్డారు. ఇటీవల చడ్డా తీరు పార్టీకి వ్యతిరేకంగా ఉందన్నారు. పార్టీకి మద్దతుగా నిలవడానికి ఆయన నిరాకరిస్తున్నారన్నారు.గుజరాత్లో ఆప్ కార్యకర్తలను అరెస్టు చేసినప్పుడు, చడ్డా ఆ విషయాన్ని రాజ్యసభలో లేవనెత్తడానికి నిరాకరించారన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా పార్టీలు ప్రవేశపెట్టిన తీర్మానంపై సంతకం చేయడానికి కూడా రాఘవ్ చడ్డా నిరాకరించినట్లు ఆప్ తెలిపింది. ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తూ ఆప్ సభ్యులు వాకౌట్ చేసినప్పటికీ.. చడ్డా సభలోనే ఉన్నారని అనురాగ్ ఆరోపించారు. రాఘవ్ చడ్డా పార్టీకి పక్షాన ఎప్పుడూ నిలబడలేదని ఆయన అన్నారు. పార్లమెంటులో వివిధ జాతీయ సమస్యలకు సంబంధించి ప్రతిపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడల్లా, దానిపై సంతకం చేయడానికి రాఘవ్ నిరాకరించారని ఆప్ నేతలు ఆరోపించారు.
Also Read: వైరల్ వీడియో: ఎంపీ రాఘవ్ చద్దా మాస్ స్టెప్.. బ్లింకిట్ డెలివరీ బాయ్గా మారి కస్టమర్ ఇంటికి!
తనను పదవి నుంచి తొలగించడంపై రాఘవ్ చడ్డా ఓ వీడియో విడుదల చేశారు. తన సొంత పార్టీయే తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కానీ తాను అజేయుడిగా నిలిస్తానన్నారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా, ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడటమే తాను చేసిన నేరమా? అని చడ్డా అన్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఆప్ పార్లమెంటుకు తెలిపిందన్నారు. తన మౌనాన్ని ఓటమిగా భావించవద్దని ఆప్ కు చెప్పాలనుకుంటున్నానని ఆయన అన్నారు.