Bengaluru: రెస్టారెంట్లు రూటు మార్చాయా? కస్టమర్లను ఎగతాళి చేయడం మొదలుపెట్టాయా? ఆ తరహా సంస్కృతి మెట్రో నగరాల్లో మొదలైందా? బెంగుళూరులోని రెస్టారెంట్లో ఏం జరిగింది? కస్టమర్కు ఘోర అవమానం ఎలా జరిగింది? కస్టమర్ను బాడీ షేమింగ్ చేసిందా? అవుననే అంటున్నారు వినియోగదారులు. అసలు ఏం జరిగింది?
బెంగళూరు నగరంలోని కోరమంగళ ప్రాంతంలో ‘సుబ్కో ది క్రాఫ్టరీ’ పేరిట ఓ రెస్టారెంట్ ఉంది. క్వాలిటీ బాగుండడంతో టాప్ క్లాస్, ఓ మోస్తరు ప్రజలు అక్కడికి వెళ్తుంటారు. ఆ రెస్టారెంట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్న సమయంలో నిర్వాహకులకు కాసింత గర్వం తల కెక్కింది. బిల్లుపై కస్టమర్ పేరుకు బదులు ‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’ అని రాయడం వివాదానికి కేంద్రంగా మారింది. అంటే లావుగా ఉన్న నల్ల చొక్కా వ్యక్తి అని బిల్లుపై రాసి వుంది. దీంతో సదరు కస్టమర్ తన అనుభవాన్ని రెడిట్లో పంచుకున్నాడు.
ఇది ముమ్మాటికీ బాడీ షేమింగ్ అంటూ ఆన్లైన్లో దుమారం రేగింది.. ఆపై చర్చ మొదలైంది. బిల్లు చెల్లించిన తర్వాత వివరాలను గమనించానని, అందులో నా పేరు రాయలేదని రాసుకొచ్చాడు. ఫలానా టేబుల్ వ్యక్తి అనలేదని, కనీసం ఆర్డర్ నంబర్ ఇవ్వలేదంటూ మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరో కావాలనే తన రూపాన్ని కించపరిచేలా వివరాలు నమోదు చేశారని రాసుకొచ్చాడు. ఇది ముమ్మాటికీ అగౌరవపరిచే చర్య అని వాపోయాడు. వర్ణించబడిన వ్యక్తి పురుషుడు అయినంత మాత్రాన శరీరాకృతిని విమర్శించడాన్ని జోక్గా కొట్టిపారేయకూడదని సూచించాడు. హాస్యం కోసం చేసిన అనుచిత ప్రయత్నమా? కస్టమర్ను గుర్తించేందుకు ఇదా ఉపయోగించే పద్ధతి? అంటూ వినియోగదారులు చర్చించుకున్నారు.
ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో ‘సుబ్కో కాఫీ రోస్టర్స్’ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను నిశ్శబ్దంగా పరిష్కరించుకోవడం కంటే బహిరంగంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కొన్ని విషయాలను నిశ్శబ్దంగా పరిష్కరించాలని, మరి కొన్నింటిని బహిరంగంగా పరిష్కరించాలని ప్రస్తావించింది. నిశ్శబ్దంగా ఉండటం వల్లే దానికి ఆజ్యం పోసిన సంస్కృతి మనుగడ సాగిస్తుందని పేర్కొంది. సిబ్బందిలో ఒకరు ఉద్దేశ పూర్వకంగా బిల్లుపై కస్టమర్ శారీరక రూపాన్ని వర్ణిస్తూ రాశారని అంగీకరించింది. క్రూరమైన చర్య మా సంస్థలో జరగడం దురదృష్టకరమని స్పష్టం చేసింది.
ALSO READ: మహిళను చంపి సూట్కేస్లో.. రైలులో తమిళనాడు నుంచి ఆగ్రాకు, ఇల్లంతా రక్తపు మరకలు
సదరు కస్టమర్ను సంప్రదించడానికి ప్రయత్నించామని తెలిపింది. ఘటనకు పాల్పడిన ఉద్యోగిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో కస్టమర్ వివరాలను నమోదు చేసే విధానాన్ని సమీక్షిస్తామని ఈ సందర్భంగా వెల్లడించింది. బాధితుడు తమ అంతర్గత ఫిర్యాదుల కమిషన్ను సంప్రదించవచ్చని దానికి సంబంధించిన లింక్ను అందుబాటులో ఉంచింది. రెస్టారెంట్కు వచ్చిన అతిథికి క్షమాపణలు చెబుతున్నామని ముగించింది.