![Sumalatha](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/SUMALATHA-1280-x-720.jpg)
Sumalatha: సినీ నటి కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె బీజేపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను కాషాయ కండువా కప్పుకుంటానని ప్రకటించారు.
మాండ్య లోక్ సభ స్థానం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్డీయే అభ్యర్థిగా జేడీఎస్ నేత కుమార స్వామి బరిలోకి దిగుతున్నారు. ఆయనకు సుమలత మద్దతు ప్రకటించారు. అయితే ఈ సమయంలో మాండ్య నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను మాండ్యను వీడనని స్పష్టం చేశారు. ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు.
తాను స్వతంత్ర ఎంపీగా ఉన్నా కేంద్రం మాండ్యా నియోజకవర్గానికి భారీగా నిధులు ఇచ్చిందని సుమలత వెల్లడించారు. రూ. నాలుగు వేల కోట్లు గ్రాంట్ ఇచ్చిందని తెలిపారు. బీజేపీలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆయనపై ఉన్న గౌరవంతోనే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను వేరే జిల్లా నుంచి పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని . మాండ్య జిల్లా కోడలిగా ఇక్కడే ఉంటానని స్ఫష్టం చేశారు.
Also Read: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్..
గత ఐదేళ్లలో మాండ్య అభివృద్ధి కోసం చేసిన పనులను సుమలత వివరించారు. లోక్సభ ఎన్నికల్లో ఓ మహిళ స్వతంత్ర ఎంపీగా విజయం సాధించడం మామూలు విషయం కాదన్నారు. మాండ్య ప్రజలు తనను ఎంపీగా గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు.
2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేశారు. ఆమెకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కుమారస్వామి తనయుడు నిఖల్ ను సుమలత ఓడించారు. నాడు కొడుకును ఓడించి నేడు తండ్రి కోసం మాండ్యా సీటును సుమలత త్యాగం చేశారు. 2023 మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఆమె మద్దతు ఇచ్చారు.
2023 సెప్టెంబర్లో జేడీఎస్ అధినేత దేవె గౌడ ఎన్డీయే కూటమిలో చేరారు. కర్ణాటకలో 25 లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. మాండ్యతోపాటు 3 చోట్ల జేడీఎస్ బరిలోకి దిగనుంది.