Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాల్లో చోరీ, దుర్వినియోగం జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు కీలక విచారణ జరిపనుంది. ఈ వ్యవహారంపై ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్తో పాటు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించనుంది.
గత వారంలోనే ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల ఈ కేసు విచారణపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పిటిషనర్ల ప్రధాన డిమాండ్లు
మందిర విరాళాల లెక్కింపు, ఖాతాల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రంగా సీబీఐ దర్యాప్తు జరిపించాలని, టెంపుల్ ట్రస్ట్కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం విరాళాల వివరాలను బహిరంగంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు గత ఆదేశాలు
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా, ఈ విచారణ బృందంలో నైపుణ్యం ఉన్న ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా భాగస్వామిగా చేర్చాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు జరిపిన పరిశోధనకు సంబంధించిన పూర్తి స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని గతంలోనే ఆదేశించింది. రేపటి విచారణలో సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. ఊరూరా నేతలను నిలదీయండి: కేటీఆర్