Puducherry Ban Cotton Candy: కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేయడంతో వీటిపై నిషేధం విధించారు.
ఒక వీడియోలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నట్లు తెలిపారు. ఈ రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు.
తమిళిసై తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేస్తూ.. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం.. రోడోమైన్ బీ ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగించే రసాయనం. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యంతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది.