Jammu Accident : ఇటీవల కాలంలో జమ్ము కశ్మీర్ ప్రాంతంలో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. దట్టమైన పొగ కారణంగా వాహనాలు అదుపుతప్పి లోయల్లో పడిపోతున్నాయి. అలా.. ఆదివారం నాడు సైతం ఓ ప్రయాణికుల వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో నలుగురు దుర్మరణం పాలైయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ప్రమాద వార్త తెలిసి పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం నాడు ఓ వాహనం అదుపు తప్పి కొండపై నుంచి దొర్లుకుంటూ కింద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇదే ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని పోలీసులు వెల్లడించారు. కిష్త్వారా జిల్లాలోని పద్దర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు.. ఘటనా స్థలానికి రెస్కూ బృందాలతో పాటుగా చేరుకున్నారు. కానీ.. లోయలో పడిపోయిన వాహనాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. ఈ ప్రమాదంపై ఉధంపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్న మంత్రి.. వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారన్న విషయం తెలిసి బాధగా ఉందన్నారు.డ్రైవర్తో సహా మరో ఇద్దరు వ్యక్తుల జాడ తెలియలేదని వారి కోసం రెస్కూ బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ శవన్ను సంప్రదించినట్లు వెల్లడించిన మంత్రి.. రెస్క్యూ టీమ్లను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పర్వత సానువుల్లో ఎంతో ఆహ్లాదంగా ఉండే జమ్ము, కశ్మీర్ ప్రాంతంలో చలి కాలం వచ్చిందంటే.. మంచు, పొగ దట్టంగా అలుముకుని ఉంటాయి. ఈ కారణంగానే.. చలి కాలంలో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి.
Also Read : టీవీఎస్ ను ఢీకొట్టిన లారీ.. భార్యా, భర్త, కుమార్తె మృతి
ఇటీవల జమ్ము కశ్మీర్ ప్రాంతంలోనే ఆర్మీ జవాన్ల వాహనాలు లోయలో పడిన ఘటనలు జరగగా.. అందులోనూ కొందరు సైనికులు మృతి చెందారు.