Union Budget 2025-26 : పార్లమెంటులో ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2025-26 పార్లెమెంటులో సమర్పణ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. దేశమంతా ప్రజలు.. పన్నుల తగ్గింపు, పలు కీలక రంగాల్లో ఊతం ఇచ్చేందుకు ఈ సారి బడ్జెట్లో ఏముంటుందని ఆశగా ఎదురుచూస్తోంది.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమావేశమయ్యారు.
పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణ చేయనుండగా.. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. తర్వాత పార్లమెంట్కు వెళ్లారు.
పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి మధుబని కళకు నివాళిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చీర కట్టుకున్నారు. దులారీ దేవి 2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీత.
జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2025-26 అంచనా రశీదులను సమర్పిస్తారు.
ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం
మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం
గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం
కేంద్ర ఆర్థిక మంత్రిగా సీతారామన్కు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు.
బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
9:30గంటల సమయంలో సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగింది.
37 పాయింట్ల లాభంతో నిఫ్టీ కూడా పెరిగింది.
ఆకట్టుకుంటున్న ‘బడ్జెట్ సైకత శిల్పం’
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.
8% వృద్ధితోనే ‘దేశం అభివృద్ధి’
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే రాబోయే రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి సాధించాలని ‘ఆర్థిక సర్వే’లో తేలింది. దీని కోసం భూ – కార్మిక సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించింది. పెట్టుబడులు కూడా జీడీపీలో 35% ఉండాలని పేర్కొంది. ఉత్పత్తి రంగాన్ని బహుముఖంగా విస్తరించాలని, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వివరించింది.
ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు
వ్యవసాయేతర రంగాల్లో 2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన విద్య లభించే ఏర్పాట్లు చేయాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు అనువైన పరిస్థితులు కల్పించాలి. వీటికి నియమ నిబంధనల ఒత్తిడి తక్కువగా ఉండాలి. వ్యాపార సంస్థల సమస్యలకు మూలకారణాలను అన్వేషించి, పరిష్కరించటం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ లో భాగం కావాలని వివరించింది.
ఆర్థిక మార్కెట్లపై జాగ్రత్త
ఆర్థిక – విధానపరమైన నిర్ణయాలను.. ఆర్థిక మార్కెట్లు మరీ ఎక్కువ ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించాలని ‘ఆర్థిక సర్వే’ హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితిని ఆర్థిక శాస్త్రంలో ‘ఫైనాన్షియలైజేషన్’ అని వ్యవహరిస్తారు. స్థిరాస్తి, స్టాక్మార్కెట్లు ధరలు విపరీతంగా పెరగడం దీని ముఖ్య లక్షణాల్లో ఒకటి. అంతేగాక ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ‘ఫైనాన్షియలైజేషన్’ వల్ల ప్రజలు, ప్రభుత్వాలపై రుణభారం అనూహ్యంగా పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో మనదేశం అప్రమత్తంగా ఉండాలి. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే ఆర్థిక రంగం విస్తరణ, ఆర్థికాభివృద్ధి మధ్య సమతౌల్యాన్ని పాటించాలని పేర్కొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక మార్కెట్లపై మరీ అధికంగా ఆధారపడటం వల్ల గత సంవత్సరం నష్టాలే ఎక్కువగా చవిచూడాల్సి వచ్చింది.
భారత్లో బ్యాంకులు బలంగా ఉన్నాయి
ఆర్థిక సేవల రంగం ఎన్నో సానుకూలతలను ప్రతిబింబిస్తోంది. బ్యాంకులు బలంగా ఉన్నాయని, డిపాజిట్లు- రుణాల్లో వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని.. బ్యాంకుల లాభాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. బ్యాంకుల్లో వినియోగ రుణాలు పెరుగుతున్నట్లు వివరించింది. స్టాక్మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నందున, ఈక్విటీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని.. ఐపీఓ (పబ్లిక్ ఇష్యూ) లకు అధిక ఆదరణ లభిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అననుకూల పరిస్థితులున్నా, మనదేశంలో ఆర్థిక రంగం ఎంతో మెరుగైన స్థితిని ప్రదర్శిస్తోంది.