Union Budget 2025: ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో అంచనాల నడుమ కేంద్ర బడ్జెట్ ఇవాళ లోక్సభలోకి రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్పై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు కేంద్ర బడ్జెట్ అప్డేట్పై ఎంతో ఆసక్తితో ఉన్నారు. అలాగే, గత బడ్జెట్ అనుభవాలను నెమరేసుకొని అంచనాలు వేసుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు వారి వారి ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రం ముందు ఉంచారు. అయితే, తెలంగాణకు కేంద్రం బడ్జెట్లో మొండి చేయి చూపుతూనే వస్తోంది. ఎనిమిది ఎంపీ స్థానాలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు కేంద్రం నుంచి సరైన కానుక రానేరాలేదనే చెప్పాలి. ఈ కోణంలో బీజేపీ ఎంపీలుగా ఉన్న నాయకులు.. అటు ప్రజాక్షేత్రంలో.. ఇటు అధికార కాంగ్రెస్, BRS విమర్శల నడుమ నలిగిపోతున్నారు.
ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చెప్పుకోదగ్గ కేటాయింపులు ఉంటాయేమో అని ఇతర పార్టీల నాయకులకంటే.. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే వేయి కన్నులతో ఎదురు చూస్తున్నట్టు సమాచారం. కనీసం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని అవసరాలకైనా కేంద్రం సహకరిస్తుందా.. లేదా? అనేది కేంద్ర బడ్జెట్ వేళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మదిలో మెదులుతున్న ప్రశ్న.
కరీంనగర్- కాజీపేట రైల్వైలైన్కు సంబంధించి గత బడ్జెట్లో ఊసే లేదు. అంతేకాదు, అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్కు నిధులు ఇచ్చినా.. రాష్ట్ర వాటా సరైన పద్ధతిలో రాక భూసేకరణకు ఆటంకం ఏర్పడిందని సమాచారం. అలాగే, మణుగూరు- రామగుండం- కోల్ కారిడార్ లైన్కు గత బడ్జెట్లో 5 కోట్లు మాత్రమే కేటాయించి కేంద్రం చేతులు దులుపుకుంది. త్వరలోనే వందే భారత్ రైలు సేవలు అందుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది చెప్పినా.. ఆ ముచ్చటే లేకుండా పోయింది.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టులకు ఈ సారైనా కేంద్ర నుంచి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అలాగే, పన్నుల్లో వాటా, గ్రాంట్లు ఇవ్వకపోతారా? అని రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశతో ఎదురు చూస్తోంది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారైనా తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలకు పచ్చ జెండా ఊపుతుందా? లేదా? అనేదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
ఇక ఏపీ విషయానికొస్తే.. 2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం నుంచి నిరంతరం మద్దతు అవసరమని బాబు భావిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు వారికి అందజేశారు.
ఈ విజన్ సాకారం చేసుకునే దిశగా ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఏడు వేల కోట్లు, అమరావతి నిర్మాణానికి 50 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12 వేల కోట్లు, అప్పులు తీర్చేందుకు ఇలా లక్ష కోట్లు వరకూ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. మరి ఈ బడ్జెట్లో బాబు విజ్ఞప్తులపై కేంద్రం ఎంత మేర స్పందింస్తుంది. నిధులను ఎంత వరకు కేటాయిస్తుందనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఇక బడ్జెట్లో ఈ ఏడాది కేంద్ర పథకాలెకు కేటాయింపులు పెరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, PM కిసాన్, PM ఆవాస్ యోజన వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని సమాచారం. ఈ పథకాలే కాకుండా.. మరికొన్ని కొత్త పథకాలు సైతం ప్రవేశపెడతారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య భీమాపై కేంద్రం ఈ బడ్జెట్లో ఫోకస్ చేయనున్నట్టు సమాచారం.
Also Read: వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనాలు విడుదల.. ఈ రంగాల్లో పెట్టుబడులకు మంచి ఫూచర్..
దేశంలో దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య భీమా కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ను ప్రవేశపెట్టారు. అయితే కోవిడ్ తర్వాత ఈ పథకం లబ్దిదారుల సంఖ్య గణనీయంగా పెరిగి 50 కోట్లకు చేరుకుంది. తాజాగా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ దఫా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు పెరిగే అవకాశాలున్నాయి.
ఇక ముద్రా యోజన విభాగాల్లో లోన్ అమౌంట్ పెంచుతారేమోనని నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రొత్సహించడానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 3 కిలోవాట్లకు 78 వేల రూపాయల రాయతీ ఇస్తుండగా.. దీన్ని మరింతగా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను 2028 వరకు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ పథకానికి కూడా కేటాయింపులు భారీగా పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధినికి తాజా బడ్జెట్లో కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రధాని మోడీ ఇప్పటికే ఉద్యోగులకు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగిస్తామని వాగ్దానం చేశారు. పార్లమెంట్ సెషన్లో ఈ మేరకు బడ్జెట్పై హింట్ ఇచ్చారు మోడీ. దీంతో ధరల నియంత్రణ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు.