AAP MLAs Resign Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) పోలింగ్ మరో అయిదు రోజుల్లో జరగనున్న సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) గట్టి షాక్ తగిలింది. బిజేపీతో తీవ్ర పోటీ ఉన్న ఈ కీలక సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు. వీరు తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎమ్మెల్యేలలో భావనా గౌర్, మదన్లాల్ లాంటి ప్రముఖులు కేజ్రీవాల్పై, పార్టీపై విశ్వాసం కోల్పోయినట్లు తెలిపారు. ఈ మేరకు వారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు లేఖలు పంపారు. భావనా గౌర్ తన లేఖలో.. “మీ పట్ల మరియు పార్టీ పట్ల నాకు విశ్వాసం లేదు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి” అని రాశారు.
ఆప్లో అవినీతి, ఇతర అంశాలను విమర్శిస్తూ, పలువురు ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే మదన్లాల్ తనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో త్రిలోక్పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, జనక్పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తూర్బానగర్ ఎమ్మెల్యే మదన్లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్ యాదవ్, ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయెల్కు పంపినట్లు మదన్లాల్ వెల్లడించారు.
Also Read: యమునా నది నీటిని ఎన్నికల కమిషనర్ ప్రెస్మీట్లో తాగాలి.. ఈసీకి కేజ్రీవాల్ సవాల్!
అయితే, ఈసారి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు వీరెవరికీ ఆప్ నుంచి అవకాశం లభించకపోవడం గమనార్హం. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని కించపరచడానికే హరియాణా ప్రభుత్వం కుట్ర: కేజ్రీవాల్
త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి హరియాణా ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం (EC) నుంచి తనకు నోటీసులు వచ్చాయన్నారు. యమునా నది నీరు విషపూరితమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో కేజ్రీవాల్ నేడు ఎన్నికల కమిషన్ ఎదుట హాజరయ్యారు.
హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని ఢిల్లీ సీఎం ఆతిశీ (Atishi) హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini)కి పలుమార్లు ఫిర్యాదు చేశారని కేజ్రీవాల్ అన్నారు. దీనిని నివారించడానికి నీటిలో అమ్మోనియం స్థాయులను తగ్గించాలని లేదా అదనపు నీటిని విడుదల చేయాలని తాము కోరగా, ముందు అంగీకరించిన సైనీ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. క్రమంగా ఢిల్లీలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, హరియాణా చీఫ్ సెక్రటరీని సంప్రదించగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని మరియు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సి ఉంటుందని సూచించారన్నారు. ఇది ఎన్నికలను ప్రభావితం చేయడానికి బిజేపీ చేస్తున్న కుట్రగా అప్పుడే తమకు అర్థమయ్యిందని కేజ్రీవాల్ తెలియజేశారు. “జనవరి 15 తర్వాత ఆశ్చర్యకరంగా నీటిలో అమ్మోనియం మోతాదు అధికమైనట్లు గుర్తించాము. దానికి మమ్మల్ని బాధ్యులను చేయాలని కుట్ర పన్నినట్లు పసిగట్టిన ఆతిశీ ఈ విషయం ప్రజలకు తెలిసేలా చేశారు. ఆప్ పార్టీ చేస్తున్న పోరాటం వల్లే ఇప్పుడు యమునా నది నీటిలో అమ్మోనియం స్థాయులు 2.1కు తగ్గాయి. దీన్ని బట్టి ఇందులో హరియాణా ప్రభుత్వ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది” అని కేజ్రీవాల్ అన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ప్రవర్తన వల్ల.. ప్రజలు ఎన్నికల కమిషన్ పట్ల విశ్వాసాన్ని (Election Commission) పూర్తిగా కోల్పోయారని కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన సంస్థగా ఈసీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రతిపక్షాలను ధైర్యంగా ప్రశ్నించగలిగే ఎన్నికల సంఘం బిజేపీ చేస్తున్న అవినీతి, అక్రమాలను మాత్రం విస్మరిస్తోందని మండిపడ్డారు.