ఎలన్ మస్క్ కి చెందిన వ్యాపారాల్లో ఒకటి శాటిలైట్ కమ్యూనికేషన్. స్టార్ లింక్ శాటిలైట్స్ ని ఉపయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మస్క్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. తాజాగా భారత్ కూడా స్టార్ లింక్ ఎంట్రీకి అనుమతిచ్చింది. అయితే స్టార్ లింక్ వస్తే తమకు తిప్పలు తప్పవని భావిస్తున్నాయి స్థానిక టెలికాం ప్రొవైడర్ సంస్థలు. ఈ భయాన్ని కేంద్ర ప్రభుత్వం పోగొడుతూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. స్టార్ లింక్ శాటిలైట్ సేవలపై కేంద్రం ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.
అనుమతులు ఇలా..
భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ ద్వారా స్టార్ లింక్ అధికారిక లైసెన్స్ పొందింది. భారత్ లో అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్ లింక్ కంపెనీని అనుమతిస్తూ ఈ లైసెన్స్ ఇచ్చారు. ఈ లైసెన్స్ ఐదు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కూడా స్టార్లింక్ కి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే ప్రొవైడర్లు తమ ఆదాయంలో 4 శాతం ప్రభుత్వానికి రుసుములుగా చెల్లించాలని ట్రాయ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ రుసుము వల్లే సదరు సర్వీసుల రేటు మరింత పెరిగే అవకాశం ఉంది.
స్టార్ లింక్ ఎంట్రీ ఇచ్చినా ప్రారంభ ధరలు గరిష్టంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే స్టార్ లింక్ సేవల నాణ్యతను దృష్టిలో ఉంచుకుంటే ఉన్నతాదాయ వర్గాల వారు, గరిష్టంగా ఇంటర్నెట్ వినియోగించేవారు అటువైపు మళ్లే అవకాశం ఉంది.
పరిమిత కనెక్షన్లు..
స్టార్ లింక్ ఎంట్రీతో దేశీయంగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల కనెక్షన్లు తగ్గిపోకుండా కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర టెలికం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. స్టార్ లింక్ భారత్ లో తమ సర్వీసులు ప్రారంభించినా కేవలం 20లక్షల మందికి మాత్రమే నెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. గరిష్ట పరిమితిని ప్రభుత్వం విధించినట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ ని కూడా స్టార్ లింక్ కి పరిమితం చేసినట్టు తెలిపారు. 200Mbpsకి పరిమితమైన ఇంటర్నెట్ ని మాత్రమే ప్రస్తుతానికి స్టార్ లింక్ అందించేలా నిబంధనలు ఖరారు చేశారు.
ఎందుకీ నిబంధనలు..?
దేశీయంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు స్టార్ లింక్ ఎంట్రీతో కంగారు పడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమర్థంగా సేవలు అందించే BSNL కి ఇది గట్టి పోటీ అంటున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం విధించిన నిబంధనలతో BSNL కి వచ్చిన నష్టమేమీ లేదని తేలిపోయింది. కస్టమర్ల విషయంలో, స్పీడ్ విషయంలో పరిమితి విధించడంతో స్టార్ లింక్ ఎంట్రీ ఇచ్చినా, కనెక్షన్లలో దూసుకు పోవడం ఆలస్యం అవుతుంది. ఇక BSNL కూడా ఇప్పట్లో తమ టారిఫ్ లను పెంచదని చెబుతున్నారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్. కనెక్షన్లను పెంచుకోవడమే తమ ప్రధాన లక్ష్యం అని ఆయన అన్నారు.