Air India Service : ఎయిరిండియాలో ప్రయాణించిన ఓ కేంద్ర మంత్రికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తనకు విమానంలో విరిగిపోయిన, పూర్తిగా వెనక్కి వంగిపోయిన సీటు వచ్చిందంటూ.. ఏకంకా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికుల నుంచి డిమాండ్ కు తగ్గట్లు ఛార్జీలు వసూలు చేస్తూ విరిగిపోయిన సీటు కేటాయించడం వారికి మోసం చేసినట్లు కాదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో.. సివిల్ ఏవియేషన్ మినిష్టర్ రామ్మోహన్ నాయుడు నిముషాల్లోనే స్పందించారు. ఘటనను పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందిగా డీసీజీఏ అధికారుల్ని కేంద్ర మంత్రి ఆదేశించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. శనివారం భోపాల్ నుంచి న్యూదిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో తనకు విరిగిపోయిన సీటు వచ్చిందని, దాంతో.. ప్రయాణమంతా తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాట్లు పేర్కొన్నారు. తన బాధను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X) ద్వారా చౌహాన్ వెల్లడించారు. టాటా గ్రూప్ సంస్థ.. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత సర్వీసులు చాలా మెరుగుపడి ఉంటాయని తాను అనుకున్నానని, కానీ.. అదంతా అపోహే అని ఈ రోజే తెలిసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని ప్రశ్నించిన మంత్రి.. భవిష్యత్తులో ఏ ప్రయాణీకుడికి ఇలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటారా.? లేదా.?, ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరుకోవాలనే అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటారా అంటూ ప్రశ్నించారు.
ఎయిరిండియా క్షమాపణలు
శివరాజ్ సింగ్ చౌహాన్ పోస్ట్పై స్పందించిన ఎయిర్లైన్ సంస్థ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తమ సేవల్లో లోపానికి క్షమాపణలు తెలపింది. చౌహన్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిపై ఆరా తీస్తున్నామని మంత్రికి హామి ఇచ్చింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది.
పౌరవిమానయాన శాఖ స్పందనృ
చౌహాన్ ట్వీట్ తర్వాత పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెంటనే స్పందించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని మంత్రి ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే.. విమానయాన మంత్రి ఎయిర్ ఇండియాతో మాట్లాడారని, చౌహాన్ తోనూ మాట్లాడి విషయం తెలుసుకున్నట్లు రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా ఈ ఘటనపై వివరాలను పరిశీలిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త విమానంలో సేవా లోపం
ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ ఎయిరిండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ విమానాన్ని సంస్థ కొనుగోలు చేసింది. ఇది పాతది కాదని, విమాన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం విమానం ఏడాది క్రితమే సర్వీసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విమానం.. శనివారం ఉదయం ఎయిర్ ఇండియా భోపాల్-దిల్లీ మధ్య నడుస్తున్న ఈ విమానం ఉదయం 8.19 గంటలకు భోపాల్ నుంచి బయలుదేరి దాదాపు గంట తర్వాత దిల్లీకి చేరుకున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం తెలుస్తోంది.