ఏపీ సీఎం చంద్రబాబు జనాభా పెంచాలంటూ కొత్త దంపతులకు ఉపదేశమిస్తున్నారు. ఒక్కరితో ఆగిపోవద్దని, వీలేతే ఇద్దరు, కుదిరితే ముగ్గురు పిల్లల్ని కనాలని చెబుతున్నారు. అటు తమిళనాడు సీఎం కూడా అదే మాట నొక్కిచెబుతున్నారు. ప్రస్తుతం జనాభాలో భారత్ టాప్ ప్లేస్ లోనే ఉంది కానీ, జననాల రేటు తగ్గిపోవడంతో రాబోయే రోజుల్లో యువత సంఖ్య భారీగా తగ్గిపోతుందనమాట. అందుకే నాయకులంతా పిల్లల్ని కనండిబాబూ అంటూ ముందుచూపుతో చెబుతున్నారు. ఆ మాటను కాస్త గట్టిగా ఫాలో అవుతున్నట్టున్నారు ఉత్తర ప్రదేశ్ హాపూర్ జిల్లాకు చెందిన ఇమాముద్దీన్, గుడియా. వీరిద్దరికీ 14మంది పిల్లలు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 50 ఏళ్ల వయసులో గుడియా 14వ బిడ్డకు జన్మనివ్వడం.
14మంది సంతానం..
ఇటీవల జర్మనీకి చెందిన 66 ఏళ్ల ఓ వృద్ధ మహిళ తన 10వ బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. ఉత్తర ప్రదేశ్ కి చెందిన గుడియా ఆమెకు ఏమాత్రం తీసిపోలేదు. 50 ఏళ్ల వయసులో ఏకంగా 14మందికి జన్మనిచ్చి ఔరా అనిపిస్తోంది. ఈ ఆదర్శ దంపతుల్ని, వారి 14మంది పిల్లల్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆస్పత్రి గేటు వద్దే ప్రసవం..
50 ఏళ్ల వయసులో కాన్పు అంటే కాస్త కష్టమే. అందులోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రతి కాన్పు కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ 14 సార్లు గుడియాకు సుఖ ప్రసవాలు అయ్యాయి. 14వసారి ఆమెను డెలివరీ కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మీరట్ కు రెఫర్ చేయగా, అక్కడికి వెళ్లడం ఆలస్యమవుతుందని, మధ్యలో హాపూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రి గేటు వద్దకు రాగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. అక్కడే ప్రసవం జరిగింది. ఆ తర్వాత ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
గుడియా తొలి సంతానం వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు. అంటే 27 ఏళ్ల వయసులో ఆమెకు అబ్బాయి పుట్టాడు, ఇప్పుడు 50 ఏళ్ల వయసులో 14వ బిడ్డకు జన్మనిచ్చింది గుడియా. అంటే 27 ఏళ్లలో 14 ప్రసవాలు అనమాట. ప్రతి సారీ బిడ్డ మొదటి పుట్టినరోజు నాటికి ఆమె తిరిగి గర్భంతో ఉండేది. గుడియా విషయంలో పెద్దవాళ్లు కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. మరోవైపు వైద్యులు వారిని కుటుంబ నియంత్రణకోసం ప్రోత్సహించినా, వారు వినలేదని తెలుస్తోంది. అందుకే 14మంది బిడ్డలకు గుడియా తల్లి అయింది. అదే సమయంలో ప్రసవలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆమె వరుసగా పిల్లల్ని కన్నది. 14 ప్రసవాల్లో కూడా ఎప్పుడూ తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెబుతోంది గుడియా.
ఇమాముద్దీన్-గుడియా పెద్ద ఆస్తిపరులేమీ కాదు. కానీ దేవుడిచ్చిన బిడ్డల్ని వద్దని చెప్పే హక్కు మనకు లేదని అంటారు వారు. అందుకే తాము వారి ఆలనా పాలనా గురించి ఆలోచించలేదని అంటున్నారు. నారు పోసినవాడు నీరు పోయడా అనే సిద్ధాంతంతో ఇప్పటికే 14మందిని కనిపెంచుతున్నారు. భవిష్యత్తులో వారు ఈ ఆలోచనను విరమించుకుంటారా, లేదా అనేది తేలాల్సి ఉంది. గుడియా-ఇమాముద్దీన్ దంపతులు మరింత మంది పిల్లల్ని కనాలనుకుంటే మాత్రం కచ్చితంగా జర్మనీ మహిళ రికార్డ్ ని వారు తిరగరాసే అవకాశం ఉంది.