Thriller Movie : మలయాళ సినిమా థ్రిల్లర్ జానర్ లో క్లాసిక్గా నిలిచిన చిత్రం ‘మెమొరీస్’ (Memories). జీతూ జోసెఫ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం మద్యపాన వ్యసనం, మైండ్ గేమ్స్, సస్పెన్స్తో వంటి అంశాలతో నిండి ఉంటుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే ఈ సినిమా JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం మూవీ లవర్స్ ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.
సామ్ అలెక్స్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఇందులో మన హీరో. ఒకప్పుడు అత్యంత తెలివైన, ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. కానీ గతంలో అతని కళ్ల ముందే ఒక శత్రువు అతని భార్యను, కూతురిని దారుణంగా కాల్చి చంపేస్తాడు. ఆ ఘోర ఘటనను తట్టుకోలేక సామ్ తీవ్రమైన మద్యపాన వ్యసనానికి బానిసవుతాడు. డిప్రెషన్లో మునిగిపోయిన అతన్ని పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఇలా జీవితం చీకటి బాట పట్టిన సమయంలోనే నగరంలో వరుసగా వింతైన హత్యలు జరుగుతాయి.
చనిపోయిన ప్రతి వ్యక్తినీ చేతులు కట్టి, ఊపిరాడకుండా చేసి క్రూరంగా హత్య చేస్తున్న సైకో కిల్లర్ను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. సామ్ తల్లి అభ్యర్థన మేరకు ఐజీ ఆంటోనీ (విజయరాఘవన్) సామ్కు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగిస్తాడు. మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సామ్ తన పాత ఇంటెలిజెన్స్ స్కిల్స్ను ఉపయోగించి దర్యాప్తు మొదలుపెడతాడు. హత్యలన్నీ ఒకే పద్ధతిలో జరుగుతున్నాయని సామ్ గమనిస్తాడు.
చనిపోయిన వారందరికీ గతంలో ఒక కామన్ కనెక్షన్ ఉందని కనుగొంటాడు. కిల్లర్ హత్యలను కేవలం శారీరకంగా కాకుండా, బైబిల్ వాక్యాలను వాడుకుని మతపరమైన కోణంలో చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ దర్యాప్తు సామ్ గత బాధలను మళ్లీ గుర్తు చేస్తుంది. అతని వ్యక్తిగత జీవితం, వృత్తి సమస్యలు, మద్యపాన వ్యసనం… కథను మరింత ఇంటెన్స్ చేస్తాయి. క్లైమాక్స్ లో సైకో కిల్లర్ అసలు గుట్టు బయటపడుతుంది. మరి ఆ కిల్లర్ ఎవరు ? ఎందుకు బైబిల్ ను బేస్ చేసుకుని హత్యలు చేస్తున్నాడు? క్లైమాక్స్ లో సామ్ తన మద్యపాన వ్యసనాన్ని పక్కన పెట్టి, కిల్లర్ను ఎలా ఎదుర్కొన్నాడు ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
పృథ్వీరాజ్ సుకుమారన్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తాగుబోతు, గత బాధలతో కుమిలిపోయే భర్తగా, తెలివైన ఇన్వెస్టిగేటర్గా అతని నటన అద్భుతం. విజయరాఘవన్ ఐజీ ఆంటోనీ పాత్రలో, సురేష్ కృష్ణ కీలక పాత్రలో మెరిశారు. మియా జార్జ్ జర్నలిస్ట్ పాత్రలో, మేఘనా రాజ్ సామ్ భార్యగా గుర్తుండిపోయేలా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం సినిమాకు ప్రధాన బలం. ఈ చిత్రం తర్వాతే ఆయన ‘దృశ్యం’ సిరీస్ను తీశాడు. సీజో జాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది.
Read Also : అర్థరాత్రి అమ్మాయిపై మోజు పడే ఆత్మ… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టే ట్విస్ట్