Mystery Thriller on OTT : క్లైమాక్స్ వరకు బుర్ర తిప్పేసే గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ సినిమా ఓటీటీలో చూడచ్చు. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఒక గదిలో నలుగురు అనుమానితులను కూర్చోబెట్టి పోలీస్ తన తెలివితేటలతో వాళ్ళ గుట్టు ఎలా రట్టు చేశాడనే మైండ్ గేమ్ చుట్టూ కథ తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ హంతకుడిలాగే కనిపిస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు, కానీ క్లైమాక్స్లో వచ్చే ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఊహించని రేంజ్లో ఉండి షాక్ ఇస్తుంది. ఒక రిటైర్డ్ జడ్జి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రోజు అతడిని కలిసిన నలుగురు స్నేహితుల చుట్టూ విచారణ సాగుతుంది. ఈ క్రమంలో బయటపడే రహస్యాలు, ఒకరిపై ఒకరికి వచ్చే అనుమానాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
2025లో వచ్చిన ఈ హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఇంటరాగేషన్’ (Interrogation). అజయ్ వర్మ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ZEE5 ఓటీటీ ప్లాట్ఫారమ్లో 2025 మే 30న విడుదలైంది. ఇందులో రాజ్పాల్ యాదవ్, అభిమన్యు సింగ్, మను సింగ్, యశ్పాల్ శర్మ, గిరీష్ కుల్కర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా ప్రధాన బలం నటీనటులు. సాధారణంగా మనల్ని నవ్వించే రాజ్పాల్ యాదవ్ ఇందులో ఒక సీరియస్ రోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే అభిమన్యూ సింగ్, యశ్పాల్ శర్మ లాంటి సీనియర్ నటులు పోటీపడి నటించడంతో ప్రతి సీన్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించిన మను సింగ్ కి ఇది మొదటి సినిమానే అయినా, ఎక్కడా తడబడకుండా ఒక అనుభవం ఉన్న పోలీస్ లాగా చాలా గంభీరంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చిత్రీకరించబడింది. సుమారు 105 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రేక్షకులను క్లైమాక్స్ వరకు కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. అందుకే ఓటీటీలో విడుదలైన తక్కువ కాలంలోనే మంచి వ్యూయర్ షిప్ను సొంతం చేసుకుంది.
ఒక ఊరిలో పెద్ద రిటైర్డ్ జడ్జి ఉండేవాడు. ఆయన రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఉన్నాడనుకుంటే, ఒకరోజు సడన్గా తన ఇంట్లోనే శవమై కనిపిస్తాడు. విషయం పోలీసుల దాకా వెళ్తుంది. అయితే ఆయన చనిపోయిన రోజు నలుగురు పాత ఫ్రెండ్స్ ఆయన్ని కలవడానికి ఇంటికి వచ్చారని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ విశాల్ ఎంట్రీ ఇచ్చి, ఆ నలుగురిని ఒకే గదిలో కూర్చోబెట్టి అసలు ఆ రాత్రి ఏం జరిగిందని తన స్టైల్లో గట్టిగా ఇంటరాగేషన్ మొదలుపెడతాడు. ఆ నలుగురిలో ఒక్కొక్కడిది ఒక్కో రకమైన వేషం. ఒకడు అమాయకుడిలా నటిస్తుంటే, ఇంకొకడు భయం భయంగా ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ గట్టిగా నిలదీసేసరికి, నేను కాదు.. వాడే చంపాడని ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటారు.
విచారణ లోతుగా వెళ్లేకొద్దీ, ఆ రిటైర్డ్ జడ్జి వెనుక ఉన్న పాత గొడవలు, ఈ నలుగురి మధ్య ఉన్న సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎవరిని చూసినా హంతకుడిలాగే కనిపిస్తుంటాడు, కానీ అసలు నిందితుడు ఎవరో పోలీసులకు అస్సలు చిక్కడు. కథ మొత్తం ఆ నాలుగు గోడల మధ్యే నడుస్తుంది. ఒక్కొక్కరి అబద్ధాలను కనిపెడుతూ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మైండ్ తో గేమ్ ఆడుతుంటాడు. ఆ నలుగురు చెప్పే కథల్లో ఒక చిన్న క్లూ దొరుకుతుంది. ఆ చిన్న క్లూ తో అసలు హంతకుడు ఎవరో తెలిసిందా ? జడ్జిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని రేంజ్లో ఉంటుంది.
Read Also : 15 మందిని బలితీసుకున్న రాత్రి… హెల్ హౌస్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు… ఓటీటీలో వణికిస్తున్న సినిమా