Social Drama OTT : ఒక హిందీ సోషల్ డ్రామా ఈ రోజు నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది పేదరికం, చదువు విలువను చాలా చక్కగా చూపిస్తుంది. 1 గంట 48 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీని పాటలు, నాటకాల రూపంలో ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. అంతేకాదు ఈ మూవీని ఎటువంటి పెద్ద నిర్మాణ సంస్థలు లేకుండా, క్రౌడ్ ఫండింగ్ తో సేకరించిన విరాళాల ద్వారా సుమారు ₹2.5 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. కేవలం సినిమా తీయడమే కాకుండా, దీని ప్రచారం కోసం చిత్ర యూనిట్ ఒక కారవాన్ వేసుకుని దేశవ్యాప్తంగా తిరుగుతూ జనాల్లోకి తీసుకెళ్లారు. .
ఈ హిందీ సోషల్ డ్రామా సినిమా పేరు ‘నుక్కడ్ నాటక్’ (Nukkad Naatak). తన్మయ శేఖర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మోల్శ్రీ, శివాంగ్ రాజ్పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2026 ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై, ఏప్రిల్ 24 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు తన్మయ శేఖర్ తన ఐఐటి రోజుల్లో వీధి నాటకాలతో ఉన్న అనుబంధంతో ఈ కథను ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. అంతేకాదు విమర్శకుల పరంగా ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (2024) లో ఈ సినిమాకు ‘స్పెషల్ జ్యూరీ అవార్డు’ లభించింది.
ఈ కథలో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. వీళ్లకి చదువు సంధ్య మీద పెద్దగా ధ్యాస ఉండదు గానీ, తిరగడం, అల్లరి చేయడం అంటే భలే ఇష్టం. ఒకరోజు అతి తెలివి ఉపయోగించి కాలేజీ క్యాంటీన్లోనే చేతివాటం చూపిస్తారు. దొంగతనం చేసి ప్రిన్సిపాల్కి దొరికిపోతారు. ఇక ఇక్కడ మీ పని అయిపోయింది, ఇంటికి వెళ్లిపొమ్మని కాలేజీ నుండి గెంటేస్తాడు. కానీ వాళ్లు కాళ్లవేళ్ల పడటంతో ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛాన్స్ ఏంటంటే.. ఊరి చివర మురికివాడల్లో తిరుగుతూ, అస్సలు స్కూలు మొహం చూడని ఐదుగురు పిల్లల్ని పట్టుకొచ్చి బడిలో చేర్పించాలి.
ఇక సరే అని వీళ్లు అక్కడికి వెళ్తే, అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రులు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. చదువుకుంటే మాకు బువ్వ వస్తుందా? అని ఎదురు తిరుగుతారు. లోకం పోకడ తెలియని ఆ అమాయక జనాల్ని ఒప్పించడం వీళ్లకు పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది. ఇప్పుడు పిల్లల కోసం తిరుగుతున్నప్పుడు ఆ కుర్రాళ్లకు అసలు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. తాము ఇంతకాలం ఎంత గాలికి తిరిగామో తెలుసుకుని పశ్చాత్తాప పడతారు. చివరికి ‘నుక్కడ్ నాటక్’ (వీధి నాటకాలు) వేసి, పాటలు పాడి జనాన్ని మెప్పిస్తారు. కష్టపడి ఆ ఐదుగురు పిల్లల్ని స్కూల్ మెట్లు ఎక్కించి, తమ కాలేజీ సీటును కూడా కాపాడుకుంటారు. అల్లరిగా తిరిగే పోరగాళ్లు బాధ్యత గల మనుషులుగా ఎలా మారారనేదే ఈ సినిమా అసలు కథ.
Read Also : తండ్రి పిచ్చిలో తప్పుదారి పట్టే కూతురు… పిచ్చెక్కించే సీన్లు