ప్రజలకిచ్చే సంక్షేమ ఫలాల విషయంలో ఏ పార్టీకదే తనదైన ముద్రవేసుకున్నది. హామీలన్నీ ఆచరణలోకి రాలేదు. కొన్ని వచ్చాయి. కొన్ని అటకెక్కాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రక్షణ సేన (టీఆరెస్) కూడా పాంచజన్యం పేరుతో ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రజలను రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా తోడ్పాటునందించే క్రమంలో కీలకమైన ఐదు అంశాలను తీసుకున్న ఆ పార్టీ చీఫ్ కవిత.. దీనికి పాంచజన్యం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ పాంచజన్యం అంశాలు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రైవేటులో కూడా విద్యా, వైద్యం మొత్తం ఉచితంగా అందించేలా కార్యాచరణ, సామాజిక తెలంగాణలో భాగంగా రాజకీయ అవకాశాల కల్పన, యువతకు రుణాలు, ఉపాధి అవకాశాలు, రైతే రాజుగా తీర్చిదిద్దేందుకు, వ్యవసాయాన్ని పండుగలా చేసే కార్యచరణ.. ఇనవ్నీ పాంచజన్యంలో ఉన్నకీలకాంశాలు. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆమె ఇవాళ మాజీ మంత్రి, సీనియర్ లీడర్ బోడ జనార్ధన్, తన అనుచరగణంతో పార్టీలో చేరిన తరువాత ఆమె మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. అందులో ఈ కొత్త ప్రణాళిక గురించి హింట్ ఇచ్చారు. పాంచజన్యంతో పాటుగా కొత్తగా మరో పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నామని స్పష్టం చేశారు. త్వరలో దీనిపై ప్రకటన ఉంటుందనడం సర్వతా ఆసక్తిని కలిగించింది.
తెలంగాణ ప్రజల జీవన గతినే మార్చే విధంగా.. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా ఆ ప్రణాళిక ఉంటుందని ఆమె ఆ పథకానికి సంబంధించి కొంత లీడ్ ఇచ్చారు. దీనిపై తుది కసరత్తు పూర్తయిందని, త్వరలో ఈ శుభవార్త వినేందుకు రెడీగా ఉండాలని కూడా ఆమె తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. త్వరలో జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నది. సాధారణ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆమె ఇది వరకే ప్రకటించి ఉన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని, తన రాజకీయ ప్రాబల్యం, గెలుపు.. మహిళలకు స్పూర్తినిచ్చే విధంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఏ పార్టీతో ఆమె పొత్తులకు పోవడానికి సిద్దంగా లేనట్టుగా ఆమె మాటల ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. దీంతో ఒంటరి పోరులో భాగంగా ఆమె జనానికి మరింత చేరువయ్యే క్రమంలో .. రాజకీయంగా మరింతగా పార్టీని బలోపేతం చేసేందుకు.. ఆమె తాము అధికారంలోకి వస్తే కొత్తగా ఏం చేయబోతున్నామనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే పాంచజన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కొత్త పథకం ఏమిటీ ? అనే విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతకు ముందు బోడ జనార్దన్ మాట్లాడుతూ.. కూడు, గూడు, గుడ్డ.. నినాదం కన్నా.. నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదం కన్నా.. కవిత ఎంచుకున్న పాంచజన్యం.. పంచభూతాలతో సమానమని.. అవి ప్రజలందరికీ ఎంతో అవసరమైన, జీవితాన్ని ప్రభావితం చేసే పథకాలని వివరించారు. ఓ ఎన్టీఆర్, ఓ కేసీఆర్ కన్నా గొప్ప పథకాలను , పెద్ద మనసుతో ఆలోచించి ప్రవేశపెట్టారని కొనియాడిన ఆయన.. చెట్టులాంటి కవితను కాపాడుకోవాలని, ఆమె ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మంచి జరిగేలా తోడ్పాటునందించాలని, కవితను సీఎం చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. టీఆరెస్ పాంచజన్యంతో పాటు.. కొత్తగా వచ్చి చేరే ఆ పథకంపై ఇప్పుడు ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి.